
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ అరవింద్ పీటీఐతో మాట్లాడిన సందర్భాన్ని ఎక్స్లో షేర్ చేశారు. ‘ కేసీఆర్ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ చేశారంటూ వస్తున్న వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.
నాపై మానసికంగానే కాదు.. శారీరకంగానూ కేసీఆర్ ప్రభుత్వం దాడి చేయించింది. ఇది రాజకీయ ఎజెండా మాత్రమే కాదు.. ఇది నేరపూరితమైన దాడి. షోన్ ట్యాపింగ్ ద్వారా కేవలం ఫోన్ కాల్స్లోకే కాదు బెడ్ రూమ్లోకి, బాత్రూమ్లోకి చట్టవిరుద్ధంగా చొరబడ్డారు. నాపై వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ప్రభుత్వ నిఘా వ్యవస్థను ప్రైవేటు నిఘా వ్యవస్థగా వాడుకుంది గత ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా చూడాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్రెడ్డి, బండి సంజయ్లు ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్ర విచారణ సంస్థలతో దర్యాప్తు చేపట్టాలి’ అని అరవింద్ కోరారు.