కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో మంత్రివర్గం నుంచి మంత్రులను బర్తరఫ్ చేసిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాలు, రాజకీయ పరిణామాలు, పార్టీ క్రమశిక్షణ వంటి కారణాలతో పలువురు మంత్రులు పదవులు కోల్పోయారు. ఎవరు ఎప్పుడు మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? మంత్రి పదవులను పోగొట్టుకున్న నేతలు ఎవరో తెలుసుకుందాం..
ఎం. రామచంద్రరావు - 1984
ఎం. రామచంద్రరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉండేవారు. లంచం తీసుకుంటున్నారన్న ఆరోపణలపై ఆయనను తొలగించారు.
డాక్టర్ తాటికొండ రాజయ్య - 2015
కేసీఆర్ తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా రాజయ్య ఉన్నారు. 2015 జనవరి 25న కేసీఆర్ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. రాజయ్య శాఖలో అవినీతి ఆరోపణలు, స్వైన్ఫ్లూ నియంత్రణలో వైఫల్యంపై వచ్చిన విమర్శలు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈటల రాజేందర్ -2021
కేసీఆర్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. భూముల ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో ఆయన శాఖను తొలగించిన తర్వాత 2021 మేలో కేబినెట్ నుంచి కూడా బర్తరఫ్ చేశారు.
గుమ్మనూరు జయరాం- 2024
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం ఉన్నారు. 2024 మార్చిలో వైఎస్ జగన్ సిఫారసుతో గవర్నర్ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. పార్టీ ఫిరాయించిన గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు.
కొండా సురేఖ- 2026
రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అటవీ, దేవాదాయ శాఖలు నిర్వహించారు. గురువారం ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించారు. కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇదీ చదవండి: కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది?


