
యువతకు శిక్షణ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
‘తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్రారంబోత్సవం’లోమంత్రి శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో రెండు లక్షల మంది తెలంగాణ యువతను ఏఐ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. బుధవారం టీ–హబ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో తొలి ఏఐ అనుసంధానిత ‘తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ (టీజీడెక్స్)’ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రస్తుతం ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదు మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి. తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐగా తీర్చి దిద్దేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఇప్పటికే తెలంగాణ ఏఐ స్ట్రాటజీ, రోడ్ మ్యాప్ను రూపొందించుకుని వడివడిగా అడుగులు వేస్తోంది. ఏఐను ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకుని అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా టీజీడెక్స్ పేరిట డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను జైకా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చాం. దీని రూపకల్పనలో బెంగళూరు ఐఐఎస్సీ సహకారం అందించింది. ఇది దేశంలో ఏర్పాటైన మొదటి ఏఐ డేటా ఎక్సే్ఛంజ్. ఇది ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువతను అంతా ఒకే వేదికపై తీసుకొచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది’అని శ్రీధర్బాబు వివరించారు.
టీజీడెక్స్ ద్వారా రైతులకు మేలు చేసే అగ్రిటెక్ స్టార్టప్స్కు డేటా లభిస్తుందన్నారు. త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని శ్రీధర్బాబు వెల్లడించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీ–హబ్ సీఈవో కవికృత్, టీ–వర్క్ సీఈవో జోగిందర్, జైకా ప్రతినిధులు టాకూచీ ఠాకూరో, యుషి నగానో తదితరులు పాల్గొన్నారు.