
హైదరాబాద్: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సరస్వతీ పుష్కరాలు విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు కొండా సురేఖ. ఈ మేరకు మంగళవారం మాట్లాడిన కొండా సురేఖ.. ‘ తెలంగాణ రాష్ట్ర వచ్చిన తొలి పుష్కరాలు అద్భుతంగా జరిగాయి. 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వరుడి దర్శనం చేసుకున్నారు.
ఇందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు, స్థానిక ప్రజలకు, భక్తులకు ధన్యవాదాలు.రాబోయే రోజుల్లో వచ్చే గోదావరి పుష్కరాలను మరింతగా గొప్పగా జరుపుకుందామని తెలియజేస్తున్న. ఈ పుష్కరాలు విజయవంతం కావటంలో కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు , స్థానిక అధికారులు, ఎండోమెంట్ డిపార్టుమెంటు వారికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.
కాగా, మే 15వ తేదీన తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.మాధవానంద సరస్వతీ స్వామి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతీ నది వద్ద మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమం వద్ద పుష్కర్ స్థానం ఆచరించి కుటుంబ సమేతంగా ప్రత్యేక అర్చనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు దంపతులు.
మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకూ సరస్వతీ నదీ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవే తొలిసారి సరస్వతీ పుష్కరాలు వచ్చాయి. రోజుకు లక్ష నుంచి లక్షన్నర వరకూ భక్తులు వస్తారని అంచనా వేసిన అంతకుమించి వచ్చినట్లు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.