
సాక్షి, మహబూబ్నగర్: తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.
టూరిజం స్టడీ టూర్లో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని సరళ సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను, కురుమూర్తి ఆలయాన్ని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల బృందంతో కలిసి మంత్రి సందర్శించారు. అనేక అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. ఆసియాలోనే రెండో ఆటోమేటిక్ సైఫాన్ వ్యవస్థ కలిగిన సరళాసాగర్తో పాటు కోయిల్ సాగర్, కురుమూర్తిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మూడు కోట్లు ఇస్తామని మంత్రి తెలిపారు.