
ఏపీలోని కింటుకూరు అడవుల్లోఎదురుకాల్పులు.. చలపతి భార్య అరుణ, మరో మహిళా మావోయిస్టు కూడా మృతి
పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న రవి
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సాక్షి, పాడేరు : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ము గ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయి స్టుల కు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి.
ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య.
ఈమెది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. గాజర్ల రవి, అరుణపై పోలీస్ రివార్డులున్నాయి. మావో యిస్టులకు సంబంధించిన పలు కీలక సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. అంజుది ఛత్తీ స్గఢ్ అని తెలిసింది. కాగా సంఘటన స్థలంలో పలు ఏకే–47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సేఫ్జోన్ అని..: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యాన్ని పోలీస్ బలగాలు జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరు స ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో పాపికొండలు, అభయార ణ్యంలోని కొండమొదలు, కింటుకూరు ప్రాంతాలను సేఫ్జోన్గా భావించిన మావోయిస్టులు ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు.
సుమారు ఆరునెలల క్రితమే పది మంది మావోయిస్టులు కింటుకూరు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం వై. రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
అరుణ అలియాస్ అరుణక్క..
వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, అలియాస్ అరుణక్క (55) మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. 20 ఏళ్ల వయస్సు లోనే మావోయిస్టు ఉద్యమం బాటపట్టారు. అమె తమ్ముడు గోపి అలియాస్ ఆజాద్ కూడా 2006లో అక్క మార్గంలోనే ఉద్యమంలో చేరాడు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మృతిచెందారు. అరుణక్క మావోయిస్టు పార్టీలో ఏఓబీ స్పెష ల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ మహిళా విభాగాల్లో 30 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య చనిపోవడంతో అరుణక్కను రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవ రిలో ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చలప తి మరణించారు. భర్త మరణంతో అరుణ కుంగిపోలేదు. అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆమె తప్పించుకున్నారు. పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండడంతో ఇటీవల కాలంలో రంపచోడ వరం అటవీ ప్రాంతాన్ని సేఫ్జోన్గా మార్చుకుని తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆమెకు ఆరుగురు మావోయిస్టులు భద్ర త ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లో బలయ్యారు. ఆమెకు భద్రతగా ఉన్న అంజూ కూడా మృతిచెందారు. ఇక అరుణక్కపై ఏపీలో రూ. 20 లక్షల రివార్డు ఉంది. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో అరుణక్క పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదుచేశారు.
కొద్ది రోజుల క్రితమే పట్టుకుని..
నా కుమార్తెను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. గతంలో నా కుమారుడు ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం .– లక్ష్మణరావు, అరుణక్క తండ్రి
అగ్రనేతగా ఎదిగి.. శాంతి చర్చల్లో పాల్గొని..
సాక్షి ప్రతినిధి, వరంగల్/టేకుమట్ల: మావోయిస్టు అగ్రనేత, శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాడిక ల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రవి.. దళ సభ్యుడిగా మొదలు పెట్టి కేంద్ర కమిటీ వరకు ఎదిగారు. విద్యార్థి దశనుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవాల బాట పట్టారు. 1985–86 సంవత్సరంలో వరంగల్లోని ఐటీఐలో చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై ఆర్ఎస్యూలో పనిచేశారు.
తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. 1992లో పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి వెళ్లారు. 1994–98 మధ్య ఏటూరునాగారం దళ సభ్యుడిగా, మహాదేవ పూర్లో కమాండర్గా పని చేశారు. 1994లో లెంకలగడ్డలో మందుపాతర పేల్చి ఏడుగురు పోలీసులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 1998లో ఎన్టీఎస్జెడ్సీ సభ్యుడిగా నియమితుల య్యారు. 2000 సంవత్సరంలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకే డబ్ల్యూ) కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు సమాచారం ఉంది. 2002 సంవత్సరంలో మహాదేవపూర్ కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీ బేగంను వివాహం చేసుకోగా ఆమె ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. 2007లో ఆంధ్ర ఒడిశా బోర్డర్కు బదిలీ అయిన రవి.. అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
శాంతి చర్చల ఎజెండా రూపకల్పనలో కీలకపాత్ర
గాజర్ల రవి 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కు మేధావులు జరిపిన సంప్రదింపులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేశ్ అలియాస్ రియాజ్, మావోయిస్టు పార్టీ నుంచి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గౌతమ్ అలియాస్ సుధాకర్లతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి కూడా పాల్గొన్నారు.
శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రవి అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ (మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు) 2008 ఏప్రిల్ 2న ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా, ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.రవి మృతిపై జిల్లా పోలీసులు బుధవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వెలిశాలకు తీసుకువచ్చి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఎన్కౌంటర్పై అనుమానాలు..
నా సోదరుడి మరణంపై అనుమానాలున్నాయి. ఇప్పటివరకు మృతదేహాల ఫొటోలను విడుదల చేయలేదు. పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు మధ్యాహ్నం వరకు సమాచారమివ్వలేదు. ఇది ఎన్కౌంటరో?.. పట్టుకుని కాల్చి చంపారో? ఏదైనా విష ప్రయోగం చేసి ఉండొచ్చు. – మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్