ఘనంగా మండమెలిగె | Mandamelige puja programs started | Sakshi
Sakshi News home page

ఘనంగా మండమెలిగె

Feb 13 2025 4:26 AM | Updated on Feb 13 2025 4:26 AM

Mandamelige puja programs started

మేడారానికిపోటెత్తిన భక్తులు

గద్దెల వద్ద ప్రత్యేక పూజలు  

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని మేడారంలో మినీజాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. నాలుగురోజులపాటు జరిగే జాతర మొదటిరోజు బుధవారం మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో ఘనంగా మండమెలిగె పండుగ నిర్వహించారు. ఉదయం ఆలయాలను శుద్ధి చేసిన పూజారులు.. మండమెలిగె పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. మేడారంలోని సమ్మక్క గుడిలో అమ్మవారి శక్తి పీఠాన్ని, గుమ్మాన్ని ఆడపడుచులు, పూజారులు పసుపు, కుంకుమలతో అలంకరించారు. 

సమ్మక్క పూజారి సిద్దబోయిన నితిన్‌ ఇంటినుంచి పవిత్ర జలం, పసుపు, కుంకుమలను తీసుకొని పోచమ్మగుడికి వెళ్లి.. చీర సమరి్పంచి పూజలు చేశారు. నితిన్‌ ఇంటి వద్ద తయారు చేసిన మామిడి తోరణాలను డోలు వాయిద్యాల నడుమ తీసుకొని వెళ్లి చిలకలగుట్ట వెళ్లే దారి సమీపంలో రోడ్డుకు ఇరువైపులా కట్టి, ధ్వజస్తంభాన్ని నిలిపారు. రాత్రి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి తీసుకొని డోలు వాయిద్యాలతో సమ్మక్క గద్దెకు చేరుకున్నారు. అనంతరం రహస్య పూజలు నిర్వహించారు. 

అలాగే కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాక సారయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి సారలమ్మ పూజారులతో పాటు గ్రామంలోని ఆదివాసీలంతా కలసి సారలమ్మ గుడి నుంచి పసుపు, కుంకుమ, శాకహానం (ఇప్పపువ్వు సారా) తీసుకొని గద్దెల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. మంత్రిసీతక్క బుధవారం రాత్రి మండమెలిగెపండుగలో పాల్గొన్నారు. ముందుగా సమ్మక్క గుడిలో పూజలు చేశారు. అనంతరం గద్దెలను దర్శించుకున్నారు.

భక్త జన సందడి.. 
అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచేమొదలైన భక్తుల తాకిడి మధ్యాహ్నం వరకుకొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద షవర్ల కింద స్నానాలు అచరించి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  

బాయిలర్‌ కోళ్ల అమ్మకాలు డీలా.. 
జాతరలో కోళ్లు, యాటలను మొక్కుగాసమర్పించడం ఆనవాయితీ. అయితే బర్డ్‌ఫ్లూ వార్తల ప్రభావం మినీ జాతరపై కూడా పడింది. కోళ్ల వ్యాపారులు గిరాకీ సరిగా లేక డీలా పడిపోయారు. మార్కెట్‌ రేట్‌ ప్రకారం మినీ జాతరలో బాయిలర్‌ కోడి కేజీ రూ.180, జుట్టు కోడిరూ.గుత్తకు రూ.200 అమ్మకాలు చేపట్టినా భక్తులు ముందుకు రాలేదు. దీని గురించి పలువురు భక్తులను ప్రశ్నించగా, బర్డ్‌ఫ్లూ వార్తల కారణంగా సొంత గ్రామాల నుంచి నాటుకోళ్లను తీసుకొచి్చనట్లు తెలిపారు. మరికొందరు స్థానికుల వద్ద రేటు ఎక్కువైనా నాటుకోళ్లనే కొనుగోలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement