మానవత్వం మరిచి సబ్బులు ఎత్తుకెళ్లారు! | Mancherial Road Accident: Public Rushes to Take Santoor Soap Boxes | Sakshi
Sakshi News home page

మానవత్వం మరిచి సబ్బులు ఎత్తుకెళ్లారు!

Jun 27 2025 3:26 AM | Updated on Jun 27 2025 3:26 AM

 Mancherial Road Accident: Public Rushes to Take Santoor Soap Boxes

లారీలోని సబ్బులు ఎత్తుకెళ్తున్న ప్రజలు

రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌ మృతి

ఓ లారీలోని సబ్బులు ఎత్తుకెళ్లిన ప్రజలు

లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధి ఇటిక్యాల గ్రామ స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్‌ మృతి చెందాడు. దేవాపూర్‌ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తున్న సిమెంటు ట్యాంకర్‌ లారీ, హైదరాబాద్‌ నుంచి సంతూర్‌ సబ్బుల లోడ్‌తో ఛత్తీస్‌గఢ్‌ వెళ్తున్న లారీఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాసిపేట మండలం పలాంగూడ గ్రామానికి చెందిన ట్యాంకర్‌ లారీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ (52) క్యాబిన్‌లో ఇరుక్కుని మృతిచెందాడు.

పోలీసులు రెండు గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. మరో లారీ డ్రైవర్‌ సచిన్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదిలా ఉండగా.. సంతూర్‌ సబ్బుల లారీ యాక్సిడెంట్‌కు గురైన విషయం తెలియడంతో సమీపంలోని ప్రజలు పెద్దఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని లారీపైకి ఎక్కి ఇష్టారాజ్యంగా సబ్బులు ఎత్తుకెళ్లారు. సబ్బులను సంచుల్లో నింపుకొని కొందరు వెళ్లగా, మరికొందరు పెట్టెలను ఎత్తుకుని వెళ్లారు. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్లు ఒకవైపు నెత్తురోడుతూ ఉండగా వారిని రక్షించకుండా స్థానికులు సబ్బులకోసం ఎగబడ్డారు. గురువారం ఉదయం కూడా పలువురు సబ్బులను తీసుకెళ్లడం కనిపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement