సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య సూసైడ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ని సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, ఏడాది నుంచి డాక్టర్లు లావణ్య, ప్రణయ్ తేజ్ ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు. కానీ, పెళ్లికి కులం వేరే ఉందని ప్రణయ్ సాకు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కారణంగానే మనస్తాపంతో పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని లావణ్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు.
ఇదిలా ఉండగా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్ డాక్టర్ లావణ్య.. నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బి.లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్షిప్ చేస్తోంది. శుక్రవారం ఉదయం లేబర్ రూంలో డ్యూటీలో ఉండగా అనారోగ్యంగా ఉండటంతో క్యాజువల్ డిపార్ట్మెంట్లో చికిత్స తీసుకొని కాలేజీ హాస్టల్కు వెళ్లారు.
శనివారం ఉదయం ప్రభుత్వ కళాశాల హాస్టల్లో గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు జీజీహెచ్కు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. జూనియర్ డాక్టర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.


