
ములుగు, సాక్షి: తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేలినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించలేదు.
ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని పోలీసులు, కేంద్ర బలగాలు జల్లెడపడుతూ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రోజువారీ కూంబింగ్ కోసం వెళ్లిన సమయంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం.