సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా

KTR Appreciates TNGO President Mamilla Rajender - Sakshi

ఉద్యోగ సంఘాలకు మంత్రి కేటీఆర్‌ హామీ

టీఎన్జీవో అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్లకు మంత్రి అభినందనలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. త్వరలోనే సీఎంతో ఉద్యోగ సంఘ నాయ కుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి ఇటీవల పదవీ విరమణ పొందిన సంగతి తెలిసిందే. అనంతరం టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మామిళ్ల రాజేందర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సమక్షంలో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారంతా మర్యాదపూర్వకంగా మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్‌ను అభినందించారు. ఇప్పుడు రాజేందర్‌ బాధ్యత మరింత పెరిగిందని, ఉద్యోగులు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాల న్నారు. సుదీర్ఘ కాలంపాటు టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసి రిటైరైన కారం రవీందర్‌ రెడ్డికి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కలిశారు. ఆయన కూడా ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top