సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయ పరిస్థితులపై కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. ఈ రోజు (మంగళవారం) ఈ విషయమై ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావుకు క్లాస్ పీకారు. ప్రోటోకాల్ పాటించకుండా రివ్యూ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కమిషనర్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
కాగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మళ్ళీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. కడియం శ్రీహరి వ్యవహారంపై ఇదివరకే ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ తాజాగా ఆయనపై మరోసారి సీరియస్ అయ్యారు. గతంలోనూ ఇరువురు నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందన్న నేపథ్యంలో నిన్న నియోజకవర్గంపై అధికారులతో కడియం రివ్యూ చేశారు.
సమీక్ష తర్వాత ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను కడియం కోరారు. జిల్లా వ్యవహారాలలో కడియం తల దూర్చడం ఏంటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడియంపై ఏఐసీసీ పెద్దలు, సీఎం రేవంత్కు కొండా సురేఖ లేఖ రాశారు. ఆలయాల అభివృద్ధిపై కడియం ఆదేశాలివ్వడంపై కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగంలో కడియం అయోమయం సృష్టిస్తున్నారంటూ సీఎం రేవంత్కు లేఖ రాశారు.


