
హైదరాబాద్: కంపెనీల సెక్రటరీలు దేశ కార్పోరేట్ రంగానికి రూపు రేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. దేశ విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా వడివడిగా ముందుకు సాగుతోందన్నారు. నగరంలో ఖైరతాబాద్ లోని ఆనంద్ నగర్ కాలనీలో ఐసీఎస్ఐ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా)హైదరాబాద్ చాప్టర్ నూతన భవానికి భూమి పూజ చేసిన కిషన్రెడ్డి అనంతరం మాట్లాడారు.
‘ICSI హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. కంపెనీ సెక్రటరీలు దేశ కార్పొరేట్ రంగానికి రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దేశ విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా వడివడిగా ముందుకు సాగుతోంది.
సత్యం వద(సత్యం పలుకు), ధర్మం చర(ధర్మం ఆచరించు) సూత్రం ఆధారంగా ICSI పనిచేస్తోంది.ప్రతి కంపెనీ సెక్రటరీ ప్రతిరోజు ఈ సూత్రాన్ని ఆధారంగా పని చేస్తే దేశ వ్యాపార రంగం నిజాయితీ పారదర్శకతతో ముందుకు సాగుతుంది.ఇప్పటికే భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మరో రెండేళ్లలోనే 5 బిలియన్ మార్క్ దాటనుంది.
ఈ విజయం మీలాంటి ప్రొఫెషనల్స్ హార్డ్ వర్క్, అంకితభావం, విలువలతో కూడిన వ్యాపారం వల్లే సాధ్యమైంది. ఇప్పటికే జర్మనీ, జపాన్ లాంటి దేశాలు మన టాలెంట్ ని గుర్తించి, కంపెనీ సెక్రటరీలు, లాయర్లు, అకౌంటెంట్లను వారి దేశాల్లో పనిచేసేందుకు నియమించుకుంటున్నాయి. ఇంటెలెక్చువల్స్ కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.
ఇంటలెక్చువల్, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవడం అంటే కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాదు. సమాజంతోపాటు ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుందని విషయం గుర్తుంచుకోవాలి.భారత్ ఆత్మ నిర్భరత సాధించే దిశగా కంపెనీ ICSI లాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నాను’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.