చేకూరి కాశయ్య ఇకలేరు..

Khammam: Former MLA Chekuri Kashaiah Passes Away - Sakshi

కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పని చేసిన కాశయ్య

ఉపాధ్యాయుడి నుంచి రాజకీయ నేతగా ప్రస్థానం

గురుదక్షిణ ఫౌండేషన్‌ ద్వారా సేవ

మధిర/ ఎర్రుపాలెం: కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చేకూరి కాశయ్య(85) హైదరాబాద్‌లో సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, మంత్రులు సంతాపం ప్రకటించారు. ఆయన సేవలను కొనియాడారు. నిబద్ధత గల నేతగా కీర్తి పొందిన ఈయన స్వగ్రామం ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు. చేకూరి నర్సయ్య-భాగ్యమ్మ దంపతులకు 1936లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలో పూర్తిచేసి ఆ తర్వాత మధిర హైసూ్కల్‌లో 1951-1952లో హెచ్‌ఎస్‌సీ పూర్తిచేశారు. విద్యార్థి నాయకుడిగా, మంచి వక్తగా, బహుభాషా కోవిధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత కొత్తగూడెంలో స్థిరపడి మూడుసార్లు ఎమ్మెల్యేగా, కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు.

ఖమ్మంలో గురుదక్షిణ ఫౌండేషన్‌ను స్థాపించారు. ప్రభుత్వ సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మధిర టీవీఎం పాఠశాల పూర్వవిద్యార్థి సంఘాన్ని 1979లో స్థాపించగా ఆయన వ్యవస్థాపక ప్రతినిధిగా ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావుకు సన్నిహితుడిగానూ మెలిగారు. 1956లో హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. 1958–60లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1960లో కొత్తగూడెం పంచాయతీ సమితిలో విస్తరణాధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ 1964 మార్చిలో రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరిగి 1970లో కూడా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్యేగా ఇలా..
కొత్తగూడెం నియోజకవర్గంనుంచి 1972లో, 1978లో శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయన తన రాజకీయాలకు పునాది మానవ సంబంధాలు, అనుబంధాలు అని చెబుతుండేవారు. 1978లో ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగంపై పోరాటం చేయడం, కమిషన్‌ చేయించడంతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1978లో 80 వేలమంది సింగరేణి కార్మికులు 54 రోజులపాటు చేపట్టిన సమ్మె విజయం సాధించడంలో శాసన సభ్యుడిగా ఆయన పోరాట పటిమను, నిజాయితీని నిరూపించుకున్నారు. 1987లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా విజయం సాధించి తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు.

మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నివాళి..
ఖమ్మం రూరల్‌: ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లిలోని గురుదక్షిణ ఫౌండేషన్‌ ఆవరణలో ఉంచిన చేకూరి కాశయ్య భౌతికకాయాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళవారం సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. సీపీఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు తదితరులు నివాళులరి్పంచారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top