అయ్యో..చిన్నా.. వేడి నీటిలో పడి బాలుడి మృతి

Khammam: 4 Year Old Dies Of Burn Injuries After Falling Into Hot Water - Sakshi

సాక్షి,రఘునాథపాలెం: చిన్న ఏమరుపాటు పసివాడి ప్రాణం తీసింది. ఆ ఇంట తీరని శోకాన్ని మిగిల్చింది. బద్ధ్యాతండాకు చెందిన రమేష్‌ – అరుణ దంపతుల చిన్న కుమారుడు నునావత్‌ గీతమ్‌రామ్‌(4) ఈ నెల 8వ తేదీన హీటర్‌తో నీటిని వేడి చేసిన బకెట్‌లో ప్రమాదవశాత్తు పడి..చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఇద్దరు కుమారులకు స్నానం చేయించేందుకు టీవీ దగ్గర ఉన్న స్విచ్‌బోర్డు వద్ద తల్లి హీటర్‌ ప్లగ్‌ పెట్టి బకెట్‌లో నీటిని వేడి చేసింది. అదే సమయంలో పెద్ద కుమారుడు అన్నం పెట్టాలని మారాం చేయడంతో అమ్మ అరుణ ప్లగ్‌ తీసేసి..ప్లేట్‌లో భోజనం తీసుకొచ్చేందుకు వంటగదిలోకి వెళ్లింది.

అదే సమయంలో చిన్న కుమారుడు టీవీ స్వీచ్‌ వేసేందుకు వెళ్లి అక్కడ జారి..పక్కనే ఉన్న వేడి నీటి బకెట్‌లో పడి..బిగ్గరగా కేకలు వేశాడు. ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్న తల్లి బిడ్డను బయటకు తీసింది. అప్పటికే తీవ్ర గాయాలైన బాబును తొలుత ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స చేయిస్తుండగా..ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మృతి చెందాడు. గురువారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరు బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని, ఈ ఘటన విషాదం నింపిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top