
ప్రాబబులిటీలో పట్టు ఉంటేనే మనుగడ
గురి లేకుంటే వీడియో అనలిటిక్స్ గోవిందా
చాలామంది డేటా ఇంజనీర్లకు గణితంపై పట్టు నిల్
ఇంజనీరింగ్లోనే నైపుణ్యం పెంచుకోవాలి
నాస్కామ్ నివేదికలో కీలక విషయాలు వెల్లడి
ఐటీ సెక్టార్లో డేటాసైన్స్ తికమక పెడుతోంది. ఫ్రెషర్స్ ఆ స్పీడ్ను అందుకోలేకపోతున్నారు. ఏడాది గడచినా డేటా ఆనుపానులు బుర్రకెక్కడం లేదు. దీంతో కొత్తగా చేరినవారు బెంచ్ మీదే కాలక్షేపం చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఐటీ ఫ్రెషర్స్లో ఆందోళన రేపుతోంది. ప్రాజెక్టు రాకుంటే ఉద్యోగం నిలబడటం కష్టమే. దేశవ్యాప్తంగా డేటాసైన్స్ చదువుతున్నవారు ఏటా 3.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో 80 వేల మందికే డేటా అనలిస్టులుగా ఉద్యోగాలొస్తున్నాయి. వీళ్లలో సగటున 20 వేల మందికే నైపుణ్యం ఉంటోంది. మిగిలిన 60 వేల మంది బెంచ్ మీదే ఉంటున్నారని ఇటీవల నాస్కామ్ వెల్లడించింది. -సాక్షి, హైదరాబాద్
కారణాలేంటి?
డేటాసైన్స్కు ఆయువు పట్టు గణితం. గణితంపై పట్టు సాధించాలంటే పాఠశాల స్థాయి నుంచే కష్టపడాలి. ఇంటర్లో లోతుగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా మ్యాట్రిక్స్పై పట్టు ఉండాలి. ప్రాబబులిటీస్ను ఏ రూపంలో ఉన్నా చేయగల సమర్థత ఉండాలి. కానీ ఇంటర్లోనే మ్యాట్రిక్స్, కాలిక్యులేషన్స్ను సాదాసీదాగా తీసుకుంటున్నారు. కాలేజీల్లో పరీక్ష కోసం మాత్రమే గణితం ప్రాక్టీస్ చేయిస్తున్నారు. సబ్జెక్టు లోతుల్లోకి వెళ్లడం లేదు. ఒకటి రెండు మెథడ్స్తో సరిపుచ్చుతున్నారు. ఇదే విద్యార్థులకు శాపంగా మారుతోంది.
ఇంజనీరింగ్లో ఈ విధానం పనికిరాదని అధ్యాపకులు అంటున్నారు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డేటా స్ట్రక్చర్, డిస్క్రియేట్ మేథమెటిక్స్, ఆల్గరిథమ్ డిజైన్ అండ్ అనాలిసిస్ వంటి చాప్టర్స్లో రాణించాలంటే ఇంటర్ పునాది గట్టిగా ఉండాలి. మ్యాట్రిక్స్పై పూర్తి అవగాహన ఉండాలి. బిగ్ డేటా అనాలిసిస్లో డిజిటల్ డిజైనింగ్లో డేటా విశ్లేషణ క్షణాల్లో శరవేగంగా మారుతుంది. ఐటీ సెక్టార్లో డేటా స్పీడ్ మరింత వేగంగా ఉంటుంది. దీన్ని విశ్లేషించే వేగం ఇంజనీరింగ్ ఫ్రెషర్స్కు ఉండటం లేదని ఐటీ పరిశ్రమ అంటోంది.
గురి పెట్టకుంటే గోవిందా..
ప్రపంచవ్యాప్తంగా డేటా అనలిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. అమెరికా ఇప్పటికే 5,381 బిగ్ డేటా కేంద్రాలు ఏర్పాటు చేసింది. మనదేశంలో 870 కేంద్రాలు ఉన్నాయి. మరో మూడేళ్లలో ఇవి 1,800కు చేరబోతున్నాయి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కార్పొరేట్ కంపెనీలు రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. మన దేశంలో ఈ ఏడాది చివరి నాటికి 15 లక్షల మంది డేటా అనలిస్టుల అవసరం ఉందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఉన్నది 4.5 లక్షల మందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని డేటాసైన్స్లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. డేటా వేగాన్ని పెంచేలా మైండ్సెట్ను కేంద్రీకరించే తీరును టెన్త్ నుంచే తీసుకురావాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రాబబులిటీస్, మ్యాట్రిక్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెంచాలని సూచిస్తున్నారు. ఇంజనీరింగ్ డేటా సైన్స్ చేసే విద్యార్థులు కూడా డేటా నిపుణుల వద్ద ప్రత్యేక తర్ఫీదు తీసుకోవాలని, ఆన్లైన్ కోర్సుల ద్వారా నైపుణ్యం పెంచుకోవాలని చెబుతున్నారు.
గణితమే కీలకం
డేటాసైన్స్కు కీలకం మేథమెటిక్స్. ముఖ్యంగా మ్యాట్రిక్స్పై పట్టు ఉంటేనే డేటా అనాలిసిస్లో రాణిస్తారు. ఇంటర్లోనే మేథ్స్పై సమర్థత ఎంత అనేది బేరీజు వేసుకోవాలి. ప్రాబబులిటీ, మ్యాట్రిక్స్పై ఆసక్తి ఉంటేనే డేటాసైన్స్ వైపు వెళ్లడం మంచిది. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి, జేఎన్టీయూహెచ్
స్పీడ్ లేకుంటే కష్టమే
డేటాసైన్స్పై శరవేగంగా పనిచేసే సమర్థత ఉండాలి. కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టమే. కాలిక్యులేషన్ వేగంగా ఉంటే తప్ప కంప్యూటర్ పరుగును అందుకోలేం. ఇంజనీరింగ్ స్థాయిలోనే డేటాసైన్స్లో మెళకువలు నేర్చుకోవడమే కాదు, వాటిని ప్రాక్టీస్ కూడా చేయాలి. – కంకిపాటి శేషగిరిరావు, ఐటీ రంగ నిపుణుడు