కీసర అధికారికి బాసర గుడి బాధ్యతలు | Keesara official takes charge of Basara temple | Sakshi
Sakshi News home page

కీసర అధికారికి బాసర గుడి బాధ్యతలు

Jun 26 2025 3:08 AM | Updated on Jun 26 2025 3:08 AM

Keesara official takes charge of Basara temple

దేవాదాయ శాఖలో వింత వ్యవహారం

వందల కి.మీ.దూరంలో ఉన్న గుడుల బాధ్యతల అప్పగింత

చిక్కడపల్లి ఆలయ ఈఓ.. కొమురవెల్లికి ఇన్‌చార్జ్‌

ఖమ్మం అసిస్టెంట్‌ కమిషనర్‌కు..మేడారం ఆలయ పాలన పగ్గాలు

మేడ్చల్‌ జిల్లాలోని కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి దేవాలయంలో ఈఓగా పనిచేస్తున్న సుధాకరరెడ్డికి ఇటీవల బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ కార్యనిర్వహణాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు దేవాలయాల మధ్య దూరం దాదాపు 240 కి.మీ. నగరంలోని చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈఓగా ఉన్న అన్నపూర్ణకు తాజాగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయ బాధ్యతలను అప్పగించారు. 100 కి.మీ.దూరంలో ఉన్న రెండు దేవాలయాలను నిర్వహించటం చాలా సులభమనే భావనలో దేవాదాయశాఖ ఉన్నట్టుంది. 

సాక్షి, హైదరాబాద్‌ : సమీపంలో ఉన్న అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించటం సహజమే, కానీ..వందల కి.మీ.దూరంలో ఉన్న కార్యాలయాల్లో విధుల నిర్వహణ ఎలా సాధ్యమో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకే తెలియాలి. సిబ్బంది కొరతతో ఒకే అధికారికి పలు దేవాలయాల బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. పొరుగు దేవాలయాల బాధ్యతలు చూడటం కొంత సులభమే కానీ, వందల కి.మీ.దూరంలో ఉన్న దేవాలయాల పాలనావ్యవహారాల నిర్వహణ అధికారులకు కత్తిమీద సాములా మారింది. 

ఆ రెండు దేవాలయాల మధ్య ఆరేడు గంటల ప్రయాణ సమయం ఉంటోంది. వారంలో ఒకటి రెండు సార్లకు మించి వెళ్లటం సాధ్యం కావటం లేదు. ఓ దేవాలయానికి వెళ్లినప్పుడు మరో దేవాలయంలో ఏదైనా ఘటన జరిగితే ఏడెనిమిది గంటల తర్వాత గానీ చేరుకోలేని పరిస్థితి. దీంతో ఏ దేవాలయంపైనా వారు సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారు. ఫలితంగా రెండు దేవాలయాల్లో పాలన పడకేస్తోంది. 

ఇది నేరుగా ఆలయ పురోగతి, అక్కడి కైంకర్యాలు, భక్తుల వసతులపై స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్సవాల సమయంలో, మరో దేవాలయాన్ని పూర్తిగా విస్మరించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఆ సమయంలో రెండో దేవాలయంలో అక్కడి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొంటున్నాయి.

కమిషనర్‌కూ తప్పని ‘అదనపు’తిప్పలు
భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రత్యేక రోజుల్లో 50 వేల వరకు చేరుకోవటంతో యాదగిరిగుట్ట దేవాలయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాలకమండలిని ఏర్పాటు చేసి ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా ఐఏఎస్‌ అధికారిని నియమించాలనుకున్నారు. 

అయితే పూర్తిస్థాయిలో ఓ అధికారిని నియమించకుండా దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న వెంకట్రావుకే అదనపు బాధ్యత అప్పగించారు. దీంతో ఆయన వారంలో రెండుమూడు రోజులు యాదగిరిగుట్టలో ఉండాల్సి వస్తోంది. ఆ సమయాల్లో కమిషనర్‌ కార్యాలయంలో పనులు నిలిచిపోతున్నాయి. ఆయన కమిషనర్‌ కార్యాలయంలో ఉంటే, యాదగిరిగుట్టలో లోటు కనిపిస్తోంది. అధికారి స్థానికంగా ఉంటే సిబ్బందిలో భయభక్తులు ఉంటాయని, పూర్తిస్థాయి అధికారి లేకపోతే ఇష్టారాజ్యం కొనసాగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

» ఇటీవల యాదగిరిగుట్టలో కొందరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఎలాంటి జంకూ లేకుండా దేవాలయానికి సంబంధించిన చింతపండు బస్తాలను తరలిస్తూ పోలీసులకు చిక్కారు. ఇలాంటి చోరీలు ఎన్ని జరుగుతున్నాయో అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. 
» గతంలో మేడారం సమ్మక్క–సారలమ్మ దేవాలయాలకు జాతర సందర్భంలో తప్ప మిగతా రోజుల్లో భక్తుల సంఖ్య అంత ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సాధారణ రోజుల్లో కూడా పోటెత్తుతున్నారు. దీంతో అక్కడ కచ్చితంగా ఈఓ ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ప్రస్తుతం ఆ దేవాలయానికి ఖమ్మం ఏసీ వీరస్వామిని నియమించారు. ఆ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టు కూడా ఇన్‌చార్జ్‌ నియామకమే కావటం విడ్డూరం.

ఆదిలాబాద్‌ జిల్లా సహాయ కమిషనర్‌గా ఉన్న విజయరామారావుకు ఇటీవల మెదక్‌ జిల్లాలోని నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఈఓ బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం దాదాపు 150 కి.మీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement