ఆగండి అన్నా అన్నందుకు.. నాయీ బ్రాహ్మణుడిపై ఎస్సై దాడి
సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
కరీంనగర్: హెయిర్ సెలూన్కు కటింగ్కోసం వెళ్లిన ఓ ఎస్సై అందులో పనిచేసే వ్యక్తిపై తన జులుం ప్రదర్శించాడు. ‘షాపు ఇప్పుడే తెరిచాను కొద్దిసేపు ఆగండి అన్నా’ అన్న పాపానికి పిడిగుద్దులు గుద్ది, దుర్భాషలాడాడు. ఈ ఘటన కరీంనగర్లోని ఖాన్పుర ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది. నగరంలోని త్రీటౌన్లో ఎస్సైగా విధులు నిర్వహించే చైతన్య చందర్ ఉదయం ఖాన్పుర ప్రాంతంలో ఉండే ఓ సెలూన్కు వెళ్లాడు.
తనకు కటింగ్ చేయాలని నాయీబ్రాహ్మణుడు పడాల రాములును కోరా డు. ‘ఇప్పుడే షాపు తెరిచాను. కొద్దిసేపు ఆగండి అన్నా’ అని రాములు సమాధానం చెప్పటంతో ‘నన్ను అన్నా అంటావా? కాసేపు ఆగమంటావా’? అంటూ దూషిస్తూ చేయిచేసుకున్నా డు. సెలూన్లో ఉన్న సీసీకెమెరాల్లో ఘటన దృశ్యాలు రికార్డయ్యాయి.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అప్రమత్తమైన త్రీ టౌన్ సీఐ తిరుమల్ వెంటనే టౌన్ ఏసీపీ వెంకటస్వామికి సమాచారమిచ్చారు. విచారణ అనంతరం సీపీకి నివేదిక అందించారు. ఈ ఘటనలో ఎస్సై చైతన్య చందర్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. రాములుపై దాడి చేసిన త్రీటౌన్ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని నాయీబ్రాహ్మణుల జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య డిమాండ్ చేశారు.


