మన చిత్రం.. జగమెరిగిన సత్యం | Jagamerigina Satyam Telugu Movie Village Background | Sakshi
Sakshi News home page

మన చిత్రం.. జగమెరిగిన సత్యం

Apr 18 2025 12:03 PM | Updated on Apr 18 2025 12:12 PM

Jagamerigina Satyam Telugu Movie Village Background

సినిమా అంటే ఒక క్రేజ్‌.. రంగులతో కనిపించే సినిమా చాలామందికి కల.. ఇలాంటి ఓ సినిమా మన ప్రాంతంలో రూపుదిద్దుకుంటే ఆ ఆనందం వేరు. ఎలాంటి ప్రాచుర్యానికి నోచుకోని ఆ గ్రామంలోని వెనుకబడిన     పరిస్థితులు, గ్రామస్తుల సహజ అమాయకత్వం ఈనేపథ్యంలో చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామ కేంద్రంగా రూపుదిద్దుకున్న చిత్రం.. జగమెరిగిన సత్యం..ఈనెల 18న సినిమా విడుదల కానుంది.

 

చింతలమానెపల్లి: మండలంలోని దిందా.. ఒక మారుమూల గ్రామం.. త్వరలో రంగస్థలానికి పరిచయమవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలకు, గ్రామం అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. జగమెరిగిన సత్యం టైటిల్‌తో విడుదల అవుతున్న చిత్రం 80 శాతం గ్రామంలోనే చిత్రీకరించారు. గ్రామ సమీపంలోని వాగు, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌ వారసంత, గూడెం ప్రాణహిత నది వంతెన, పెంచికల్‌పేట్‌ పెద్దవాగు, కౌటాల మండల కేంద్రం, పక్కనే మహారాష్ట్రలోని అహేరి వద్ద కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. కౌటాల ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మొదటి సన్నివేశం చిత్రీకరణతో సినిమా ప్రారంభించారు.

1994లో గ్రామీణ పరిస్థితుల నేపథ్యం..
1994లోని గ్రామీణ నేపథ్యం, అప్పటి మనుషుల కట్టుబాట్లు, దర్శకుడి చిన్నతనంలోని అనుభవాలను ఆధారంగా చిత్రం రూపొందింది. ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగాలు, సంస్కృతి, సంగీతం ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు పాలె తిరుపతి తెలిపారు. ఇందులో పలు సన్నివేశాల్లో దిందా గ్రామస్తులను బ్యాక్‌గ్రౌండ్‌లో నటించేందుకు అవకాశం కల్పించారు. సినిమాలో ఐదు పాటలు ఉండగా బతుకమ్మ పాటను గాయకురాలు మంగ్లీ ఆలపించారు. రాణా దగ్గుబాటి, సాయిపల్లవి నటించిన విరాట పర్వం చిత్రానికి పనిచేసిన సురేష్‌ బొబ్బిలి ఈచిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. హీరో రవితేజ మేనల్లుడు అవినాష్‌వర్మ, ఆద్యారెడ్డిలను హీరో, హీరోయిన్లుగా తొలిపరిచయం చేశామని, మరో హీరోయిన్‌గా నీలిమ పతకంశెట్టి నటించినట్లు దర్శకుడు తెలిపారు.

జిల్లాలో ఆలస్యంగా విడుదల
జగమెరిగిన సత్యం సినిమా కుమురం భీం జిల్లాలో కాస్త ఆలస్యంగా విడుదల కానుంది. ఈనెల 18 (శుక్రవారం)న మంచిర్యాలలో, తెలంగాణలో 33 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగజ్‌నగర్‌లో ఇతర సినిమాలకు ముందుగానే షెడ్యూల్‌ ఖరారు అయి ఉండడంతో కొన్నిరోజుల అనంతరం విడుదల అవుతుందని సినిమా బృందం తెలిపింది.

దర్శకుడు స్థానికుడే..
దర్శకుడు పాలె తిరుపతి స్వగ్రామం పెంచికల్‌పేట్‌ మండలం చెడ్వాయి. ఆయనకు చింతలమానెపల్లి మండలంలో బంధువులు ఉండగా వారి ఇంటికి వచ్చేక్రమంలో స్థానిక గ్రామాలపై పరిచయం ఉండగా సినిమా చిత్రీకరణకు కారణమైంది. గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన మంచిర్యాలలో డిగ్రీ పూర్తిచేశారు. సినిమాలపై ఆసక్తితో చిత్రరంగానికి వెళ్లి దర్శకత్వ శాఖలో 8 ఏళ్లు పనిచేశారు. ఈక్రమంలో ‘కొరియన్‌ శీర్షిక అహేరి’పేరుతో లఘుచిత్రం రూపొందించారు. అది సాధించిన విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో నాలుగు లఘు చిత్రాలను రూపొందించగా, ఈ అనుభవంతో జగమెరిగిన సత్యం చిత్రాన్ని తెరకెక్కించారు. కథానాయకుడికి చిన్నతనంలో సోదరుడిగా చింతలమానెపల్లి మండలం గంగాపూర్‌కు చెందిన దంద్రె మణికంఠ(బబ్లూ) బాలనటుడిగా 
నటించాడు.

గర్వంగా భావిస్తున్నాం
దిందా గ్రామం పేరు వెండితెరపై వినిపించడం పట్ల మేము గర్వంగా భావిస్తున్నాం. స్థానికంగా చిత్రీకరణ జరగడంతో కొంతమందికి ఉపాధి లభించింది. అటవీ ప్రాంతంలో ఉండే మా గ్రామం అభివృద్ధిలో వెనుకబడి ఉంది. సినిమాతో గ్రామానికి ప్రచారం లభించడం మేము సంతోషంగా ఉన్నాం.
– డోకె రామన్న, దిందా

సహకారం అందించాం
సినిమా చిత్రీకరణకు అనువైన ప్రదేశాల కోసం సోదరుడు అయిన డైరెక్టర్‌ నన్ను సంప్రదించారు. ఎన్నో ప్రాంతాలను పరిశీలించి దిందా గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. సినిమా చిత్రీకరణ పూర్తయ్యే వరకు సినిమా బృందానికి నాతో కలిసి గ్రామస్తులు, స్థానిక ప్రజలు సహకారాలు అందించాం. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం.
– దేవాడి రాజన్న, గంగాపూర్‌

బాలనటుడిగా మరిచిపోలేనిది
సినిమాలో నటించే అవకాశం రావడం ఒక వరం లాంటిది. నేను 8వ తరగతి చదువుకునే సమయంలో దగ్గరి బంధువు అయిన సినిమా దర్శకుడు అవకాశం కల్పించారు. నటనలో అనుభవం లేకున్నా దర్శకుడు, నటుల సహకారంతో బాలనటుడిగా నటించాను. ఈ అనుభవం మరిచిపోలేనిది.
– దంద్రె మణికంఠ(బబ్లూ), గంగాపూర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement