ఆరోగ్య సలహానా... ట్వీట్‌ చెయ్‌!

Innovative campaign by Department of Women Development and Child Welfare on social media - Sakshi

సామాజిక మాధ్యమాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వినూత్న ప్రచారం

ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ద్వారా గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులకు అవగాహన 

అంగన్‌వాడీ లబ్ధిదారులతో వీడియోలు, ఫొటోలు చిత్రీకరించి అప్‌లోడ్‌ 

రాష్ట్రంలోని అన్ని జిల్లా అధికారులు, ప్రాజెక్టులకూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ఖాతాలు 

ప్రతిరోజూ సరికొత్త రీతిలో సలహాలు, సూచనలు  

‘‘పాఠశాలల మూసివేతతో పిల్లల దినచర్య గాడి తప్పింది. వారి అల్లరిని అదుపులో పెట్టే, క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చేందుకు వారు చేయాలనుకునే పనులతో ప్రణాళిక తయారు చేయండి. ఇంట్లో పనులు చేసేందుకు అనుమతివ్వం డి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే పనుల్లో సాయం చేస్తే వారికి అలవాటవుతుంది.’’ 

‘‘కోపాన్ని తగ్గించుకోవాలా? వెంటనే లోతైన శ్వాస తీసుకొండి. పది సెకన్లపాటు ఊపిరి బిగపట్టి వదిలేయండి. ఇలా ఐదు సార్లు చేస్తే చికాకు, కోపం తగ్గి సాధారణ స్థితికి చేరుకుంటారు’’ 

‘‘చిన్నారుల మెదడు అభివృద్ధి కావాలంటే అయోడైజ్డ్‌ ఉప్పును వాడండి. అయోడిన్‌ శిశువు మెదడు అభివృద్ధికి సాయపడుతుంది, గర్భస్రావాల నుంచి రక్షిస్తుంది. తల్లి, పిల్లల క్షేమం కోసం అయోడైజ్డ్‌ ఉప్పును మాత్రమే వాడాలి’’ 

సాక్షి, హైదరాబాద్‌: ఈ సూచనలేమిటనుకుంటున్నారా...? అవేనండీ.. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ట్విట్టర్, ఫేస్‌బుక్‌ పేజీలో ఇస్తున్న సందేశాలు, సూచనలివి. మహిళలు, శిశువుల ఆరోగ్యం ప్రచారానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంది. ఈ దిశగా ఆ శాఖ వినూత్న ప్రచారానికి తెరలేపింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో నేరుగా ఇచ్చే సలహాలు, సూచనలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం కల్పిస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ప్రత్యేక పేజీలున్నాయి. వీటికి వేలసంఖ్యలో ఫాలోవర్లూ ఉన్నారు. 

స్మార్ట్‌గా సలహాలు... 
స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతుండటంతో అందుకు తగినట్లుగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా కార్యక్రమాలు ప్రారంభించింది. రెండేళ్ల క్రితమే ఈ ఖాతాలు తెరిచినప్పటికీ... లాక్‌డౌన్, అనంతర పరిస్థితుల నేపథ్యంలో వీటిపై విస్తృత ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలే లక్ష్యంగా ఈ ప్రచారం చేపట్టింది. మహిళలు తీసుకునే ఆహారం మొదలు, ఆరోగ్య స్థితి, సమస్యలు, వాటికి సమాధానాలు ఇస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో అంగన్‌వాడీలకు వచ్చే లబ్ధిదారులతో సలహా లిప్పిస్తున్నారు. వారి వ్యక్తిగత అనుభవాలతో కూడా వీడియోలు తీసి ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.  

ఫాలోవర్స్‌ లిస్టులో నీతి ఆయోగ్‌... 
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. తాజాగా ప్రతి జిల్లాలో జిల్లా సంక్షేమాధికారి ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో సీడీపీవోలు కూడా ఇదే తరహాలో ఖాతాలు తెరిచి ఫాలో అవుతున్నారు. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఖా తాను కేంద్ర మహిళాభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్‌ సైతం ఫాలో అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పోస్టులకు అవి లైక్‌ కొట్టడం, షేర్‌ చేయడంతోపాటు అభినందిస్తుండటం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top