
సంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్
ఈటీఎస్ సర్వేతో వెలుగులోకి గ‘లీజు’ దందా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గత పదేళ్లుగా అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది. రాజకీయ పలుకుబడి ఉన్న ప్రజాప్రతినిధులు, బడా బాబులు మైనింగ్ దందాలో వందల కోట్లు కొట్టేస్తున్నారు. అడిగే నాథుడే లేకపోవడంతో ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా సాగుతోంది. తవ్వకాలు జరిపిన పరిమాణానికి గాను నిర్దేశిత మొత్తంలో భూగర్భ గనుల శాఖకు చెల్లించాల్సిన సీనరేజీ చార్జీలు చెల్లించకుండా సర్కారు ఆదాయానికి గండి కొట్టడం ఇక్కడ పరిపాటైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మైనింగ్పై విచారణకు ఆదేశించింది.
ఈ క్వారీల్లో ఏ మేరకు తవ్వకాలు జరిపారు.. ఎంత కొల్లగొట్టారనే దానిపై ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) సర్వే చేపట్టారు. ఈ సర్వేలోనే భారీ ఎత్తున అక్రమాలు వెలుగులోకి రావడం గమనార్హం. కాగా.. రూ.974 కోట్లు సీనరేజీ చార్జీలు,జరిమానా కింద చెల్లించాలంటూ, అక్రమార్కులకు గతం నుంచే పలు దఫాలుగా నోటీసులు జారీ అయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
జిన్నారం, కంది, పటాన్చెరు మండలాల్లో..
భూగర్భ గనుల శాఖ నుంచి డిమాండ్ నోటీసులు జారీ అయిన క్వారీలు సంగారెడ్డి జిల్లాలోని కంది, జిన్నారం, పటాన్చెరు మండలాల పరిధిలో ఉన్నాయి. పటాన్చెరు మండలం లకడారంలోని సర్వే నంబర్ 738, 747, రుద్రారంలోని 132, లకడారం, రుద్రారంలోని 738/1, జిన్నారం మండలం ఖాజిపల్లిలోని 138, 139, 140, 143, 144, 155, 156, కంది మండలం ఆరుట్లలోని 134 సర్వే నంబర్లలో ఈ తవ్వకాలు కొనసాగినట్లు మైనింగ్ శాఖ జారీ చేసిన నోటీసులను బట్టి తెలుస్తోంది.
ఈ సర్వే నంబర్లలో తవ్వకాలు సాగించిన మొత్తం 15 మంది వ్యక్తులు, కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. ఆయా కంపెనీలు, వ్యక్తులకు సంబంధించిన క్వారీలు హైదరాబాద్ మహానగరానికి అతిసమీపంలో ఉండటంతో ఇక్కడి నుంచి నగరానికి కంకర అక్రమ రవాణా చేసి వందల కోట్లు దండుకున్నారు. నగరంలో నిత్యం భారీ ఎత్తున జరుగుతున్న నిర్మాణ రంగానికి ఇక్కడి క్వారీల నుంచే కంకర సరఫరా జరుగుతోంది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో తవ్వకాలు కొనసాగించారు.
అడ్డూ అదుపు లేకుండా..
భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకున్న విస్తీర్ణానికి మించి.. నిర్ణీత సరిహద్దులు దాటి లీజుదారులు అక్రమంగా తవ్వకాలు సాగించారు. అలాగే ఈ అదనపు విస్తీర్ణానికి ఎలాంటి సీనరేజీ చెల్లించలేదు. కంకర తరలించేందుకు ట్రాన్సిట్ పర్మిట్లు తీసుకోవాల్సి ఉండగా, అలాంటివి ఏమీ లేకుండానే భారీ టిప్పర్లలో అక్రమ రవాణాకు పాల్పడ్డారు.
ఇలా సీనరేజీని ఎగవేయడం, పర్మిట్లు తీసుకోకుండానే అక్రమ రవాణా చేయడం, తీసుకున్న అనుమతులకు మించి.. సరిహద్దులు దాటి తవ్వకాలు జరడం వంటి అతిక్రమణలకు గాను జరిమానాలు, ఎగవేసిన సీనరేజీ కలిపి మొత్తం రూ.974 కోట్లకు ఈ డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి.
కొన్ని నెలల క్రితమే..
అక్రమాలకు పాల్పడిన 8 క్వారీల లీజుదారులు జరిమానాలతో కలిపి రూ.575 కోట్లు చెల్లించాలని కొన్ని నెలల క్రితమే భూగర్భ గనుల శాఖ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం ఇలా డిమాండ్ నోటీసులు జారీ అయిన లీజుదారుల సంఖ్య 15కు చేరింది. వీరికి సంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది.
అక్రమార్కుల్లో ఓ ఎమ్మెల్యే సోదరుడి బినామీ!
పటాన్చెరు మండలం లకడారంలోని క్వారీల్లో జరిగిన తవ్వకాలకు సంబంధించి రూ.341 కోట్లు చెల్లింపునకు ఓ లీజుదారుకు ఏడాది క్రితం నోటీసులు జారీ కావడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తర్వాత ఇతనికే చెందిన మరో క్వారీలో కూడా అక్రమాలు జరిగినట్లు ఈటీఎస్ సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. ఆరుట్ల గ్రామ శివారులో ఉన్న క్వారీలో అక్రమ తవ్వకాలకు గాను రూ.249.06 కోట్లు చెల్లించాలని మరో డిమాండ్ నోటీసు జారీ కావడం గమనార్హం. ఈ లీజుదారు జిల్లాలోని ఎమ్మెల్యే సోదరుడికి బినామీ అని సమాచారం.
ఈటీఎస్ సర్వేతో వెలుగులోకి అక్రమాలు
జిల్లాలోని అన్ని మైనింగ్ కార్యకలాపాలపై ఈటీఎస్ సర్వే జరిగింది. అనుమతులకు మించి, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగినట్లు తేలింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడిన మొత్తం 15 క్వారీల లీజు దారులకు రూ.974 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీసులు జారీ చేశాం. అయతే ఈ నోటీసులు అందుకున్న లీజుదారులు అప్పిలేట్కు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి.
– రవిబాబు, భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, సంగారెడ్డి