సీసీఎస్కు చిక్కిన ఘరానా చైన్ స్నాచర్
నాలుగు ఠాణాల పోలీసులకు వాంటెడ్
14 నాన్ బెయిలబుల్ వారెంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 180కి పైగా చైన్ స్నాచింగ్స్కు పాల్పడి... నగరంలోని నాలుగు ఠాణాల అధికారులకు వాంటెడ్గా ఉండి.. 14 నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన ఘరానా నేరగాడు మహ్మద్ ఫైజల్ షా అలీ జబ్రీని సీసీఎస్ స్పెషల్ టీమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
మురాద్నగర్కు చెందిన ఇతడికి అబ్దుల్లా, సొహైల్, అల్తాఫ్ అనే మారుపేర్లూ ఉన్నాయి. 2023లో ఒకే రోజు సైఫాబాద్, మొగల్పురా, చారి్మనార్, నాంపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో వరుసగా స్నాచింగ్స్ చేశాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి బెంగళూరు పారిపోయాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్న ఫైజల్ షా ఆపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయచోటి పట్టణానికి మకాం మార్చాడు.
అక్కడ నివసిస్తూనే రాయచోటి, చేనూరు పోలీసుస్టేషన్ల పరిధిలో మరో మూడు చైన్ స్నాచింగ్స్కు పాల్పడ్డాడు. ఇతడిని పట్టుకోవడానికి డీసీపీ ఎస్.చైతన్య కుమార్ పర్యవేక్షణలో ఏసీపీ జి.వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. వీరు మంగళవారం ఫైజల్ను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.


