
పోలీస్ నిర్బంధాన్ని ఎదుర్కొనేందుకు మావోయిస్టుల వ్యూహం
ఇతర ప్రాంతాల నుంచి బస్తర్కు వస్తున్న అగ్రనేతలు
ప్రతీకార చర్యలు, పార్టీ బలోపేతానికి యత్నాలు?
మావోల వ్యూహాలకు చెక్ పెట్టే పనిలో పోలీసులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రసుత్త పరిస్థితులు చూస్తుంటే.. దండకారణ్యంపై పట్టు సడలకుండా ఉండేందుకు మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాదిన్నరగా మావోయిస్టులు బస్తర్ పరిధిలోకి వచ్చే దండకారణ్యం, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా, అబూజ్మడ్ అడవుల్లో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత 409 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. లొంగిపోయిన/అరెస్టయిన వారు మరో 1,200 మందికి పైగా ఉన్నారు.
పోలీసుల చేతిలో హతమైన వారిలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు చలపతి, ప్రయాగ్మాంజీ, సుధాకర్ వంటి అగ్రనేతలు ఉన్నారు. ఇంతకు రెట్టింపు సంఖ్యలో డివిజన్ కమిటీ సభ్యులు చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ మరో ఆరేడు నెలల్లో తన ఉనికిని కోల్పోతుందనే ప్రచారం జరిగింది. మరోవైపు ఈ ఏడాది మార్చి 28న శాంతి చర్చల ప్రతిపాదనను మావోయిస్టులు తెర మీదకు తెచ్చారు.
బస్తర్కు తిరిగి రండి..!
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు/అరెస్టులతో కేడర్ను మావోయిస్టులు చాలా వరకు నష్టపోయారు. మరోవైపు శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం, ఛత్తీస్గఢ్ సర్కార్ నుంచి సానుకూల ప్రకటన రావడం లేదు. దీంతో బస్తర్ అడవుల్లో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు మావోయిస్టులు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏఓబీ), ఎంఎంసీ (మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్), కేకేటీ (కర్ణాటక, కేరళ, తమిళనాడు) ప్రాంతాల్లో పనిచేస్తున్న అగ్రనేతలను బస్తర్కు తిరిగి రావాలని మావోయిస్టు పార్టీ కోరినట్టు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం, సాయుధ పోరాటం, గెరిల్లా వార్ఫేర్లో నిపుణులైన సీనియర్ నాయకులు రంగంలోకి దిగితే సానుభూతిపరులు, పార్టీ కేడర్లో ఆత్మ విశ్వాసం పెంచొచ్చని ఆ పార్టీ అంచనా వేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొత్తగా ఏడుగురు ఐపీఎస్లు
వానాకాలం రావడంతో బస్తర్ అడవులు చిక్కబడ్డాయి. డ్రోన్ల సాయంతో కూంబింగ్ చేయడం సైతం భద్రతా దళాలకు కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. అయినా మావోయిస్టులపై నిర్బంధం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన సుక్మా, బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్లో కొత్తగా ఏడుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది. 2021 బ్యాచ్కు చెందిన ఈ యువ అధికారులకు నక్సల్స్ను తుదముట్టించే బాధ్యతలు అప్పగించింది. కొత్తగా వచ్చిన అధికారులతో ఈ నాలుగు జిల్లాల పరిధిలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో పాల్గొంటున్న ఐపీఎస్ల సంఖ్య 20కి చేరుకుంది.
ఊహించని దాడి..
ఏఓబీ నుంచి కొందరు కీలక నేతలు ఇప్పటికే దండకారణ్యానికి చేరుకున్నట్టు సమాచారం. ఈ సందేహాలకు బలం చేకూర్చేలా పువర్తిలో సీఆర్పీఎఫ్ క్యాంప్నకు సమీపంలో ఒక వ్యక్తిని ఇటీవల మావోయిస్టులు హత్య చేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర సరిహద్దులో ఉన్న కుంట మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో భద్రాచలం–జగ్దల్పూర్ జాతీయ రహదారి నుంచి కేవలం 400 మీటర్ల సమీపంలో ఐఈడీ పేల్చి ఏఎస్పీ స్థాయి అధికారిని హతమార్చారు. తీవ్ర నిర్బంధం నడుమ వరుసగా రెండు రోజుల పాటు భద్రతా దళాల కన్నుగప్పి దాడులు నిర్వహించి ఈ ప్రాంతంపై తమకున్న పట్టు ఏంటో మావోలు తెలియజేసినట్టయ్యింది. అయితే ఈ రెండు ఘటనలపై మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
చదవండి: అడవే ఆధారం.. బతుకు భారం