Hyderabad: చికెన్ బిర్యానీలో ఈగ.. బిర్యానీ హౌజ్కు జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఓ బిర్యానీ హౌజ్ నిర్వాహకులకు రూ. 10 వేల జరిమానా విధిస్తూ వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీచేసినట్లు బాధితుడు బస్వరాజుల రాజేష్ బుధవారం వివరించారు. ఓయూ క్యాంపస్ న్యాయ కళాశాలలో చదువుతున్న రాజేష్ గత ఏడాది అక్టోబర్ 21న నల్లకుంటలోని ఓ బిర్యానీ హౌస్లో భోజనం చేస్తున్న సమయంలో ఈగ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.
అయితే నిర్వాహకులు పట్టించుకోకుండా బిర్యానీకి బిల్లు వసూలు చేశారు. దీంతో రాజేష్ వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. ఫోరం వారు కేసును విచారణ చేపట్టి ఫిర్యాదుదారుడికి నష్టపరిహారంగా రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు జరిగినట్లు మరొకరికి జరగకూడదనే ఫోరంలో కేసు వేసినట్లు రాజేష్ పేర్కొన్నారు.