సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో హరీశ్రావు సెల్ఫీ
కేసీఆర్ హయాంలో 24 గంటలు సరఫరా ఉండేది
మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో హరీశ్రావు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో పరిశ్రమలకు కరెంట్ కోతలు షురువయ్యాయని మాజీమంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. కేసీఆర్ సీఎంగా కాకముందు పరిశ్రమలకు పవర్ హాలీడేలు ఉండేవని, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు పూర్తిస్థాయిలో పని లభించేది కాదని, కేసీఆర్ సీఎం అయ్యాక వ్యవసాయంతోపాటు పరిశ్రమలకు కూడా 24 గంటల విద్యుత్ సరఫరా చేశారని, దీంతో కార్మికులకు ఓటీలు దొరికాయని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన రైతుబంధు, దళితబంధు, గొర్రెల పంపిణీ, ఉచితంగా చేపపిల్లల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను బంద్ చేసిన సీఎం రేవంత్రెడ్డి బంద్ల బాబు అని ఎద్దేవా చేశారు. ఇదేంటని ప్రశి్నస్తే బూతులే సమాధానం ఇస్తున్నారని విమర్శించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషి కేసీఆర్ను సీఎం రేవంత్రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి వాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు.
కేసీఆర్ పదేళ్ల పాలనకు, కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు ఎంతో తేడా ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు తన వద్దకు వచ్చి వారి బాధలు చెప్పుకున్నారని, రేవంత్రెడ్డిని నమ్మి మోసపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండేదని అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారని పేర్కొన్నారు. సిగాచీ ప్రమాద ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.


