హైదరాబాద్: సెప్టెంబర్ నెలలో అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఇప్పటివరకూ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంపై తెలంగాణకు చెందిన గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనగా ఉన్నారు. అపాయింట్మెంట్ లేఖలు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ పోస్టింగ్ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహతో గ్రూప్-1 అభ్యర్థులు ఈరోజు(గురువారం, నవంబర్ 6వ తేదీ) భేటీ అయ్యారు. తమ పోస్టింగ్ అంశానికి సంబంధించి మంత్రి రాజనర్సింహకు విన్నవించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 562 గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేసిన సంగతి తెలిసిందే.. ఈ నియామక పత్రాలను హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఒక కార్యక్రమంలో అందించారు. గ్రూప్-1 విజేతలకు తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత ఉందని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా, తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే జీతంలోంచి కొంత కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తామని కూడా సీఎం రేవంత్ హెచ్చరించారు.



