ఎన్నికల విధుల్లో వారికి మినహాయింపు
జీహెచ్ఎంసీ ఎన్నికల విధులకు టీచర్లొద్దు
ఇతర అధికారులు, సిబ్బంది జాబితా పంపండి
జిల్లా కలెక్టర్లకు పురపాలక శాఖ ఆదేశం
సచివాలయం, ప్రభుత్వ శాఖల
ఉద్యోగులకూ ఎన్నికల డ్యూటీ
అన్ని శాఖలకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల కోసం ఉపాధ్యాయులు (బోధన సిబ్బంది) మినహా ఇతర అధికారులు, సిబ్బంది జాబితా పంపించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. ఉపాధ్యాయులను జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో నియమించవద్దని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిపారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ 150 డివిజన్ల పరిధిలోని 9,235 కేంద్రాల్లో పోలింగ్ జరగనుందని, ఒక్కో కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి (పీఓ), సహాయ ప్రిసైడింగ్ అధికారి (ఏపీఓ), ఇద్దరు ఇతర పోలింగ్ సిబ్బంది (ఓపీఓ) కలిపి మొత్తం 36,940 మంది అవసరమని.. అత్యవసర సేవల్లో పనిచేయడానికి అదనంగా 30 శాతం అనగా 11,082 మంది రిజర్వు సిబ్బంది అవసరమని అర్వింద్కుమార్ తెలిపారు.
ఎన్నికల సిబ్బందికి కనీసం రెండు శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉందని, సమయం లేనందున తక్షణమే జాబితాలను జీహెచ్ఎంసీ కమిషనర్కు పంపాలని ఆదేశించారు. సచివాలయంతోపాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో నియమించాలని నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం అన్ని ప్రభుత్వశాఖలకు లేఖలు రాశారు. సచివాలయం, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది జాబితాను ఎన్నికల విధుల కోసం తక్షణమే జీహెచ్ఎంసీ కమిషనర్కు పంపించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, అబ్కారీ వంటి పన్నులు, ఆదాయం తెచ్చే శాఖల అధికారులు, సిబ్బందికి ఈ విధుల నుంచి మినహాయింపు కల్పించారు.
సంబంధిత వార్తలు