ముగిసిన గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం | GHMC Election Campaign Wind Up | Sakshi
Sakshi News home page

ముగిసిన గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం

Nov 29 2020 6:42 PM | Updated on Nov 29 2020 8:09 PM

GHMC Election Campaign Wind Up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటికే డిసెంబర్ 1వ తేదీన జ‌రిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 150 వార్డులనుంచి 1122మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికలు ముగిసేవరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విధ‌మైన ఇబ్బందులు లేకుండా ఎన్నిక‌ల ప్ర‌క్రియ స‌జావుగా సాగింది. 

 డిసెంబర్ 1న ఉదయం 5:30 గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి. ఉదయం 6 గంట‌ల‌కు పోలింగ్ ఏజెంట్లు హాజ‌రుకావాలి. ఉదయం 6 గంట‌ల నుండి 6:15 గంట‌ల మ‌ధ్య మాక్ పోలింగ్ జ‌రుగుతుంది. ఉదయం 6:55 గంట‌ల‌కు బ్యాలెట్ బాక్స్‌లను సీల్ చేయ‌డం జ‌రుగుతుంది. ఉదయం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంట‌ల‌కు పోలింగ్ పూర్తి అవుతుంది. కోవిడ్-19 పాజిటీవ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం ఉంటుంది. కోవిడ్ పాజిటివ్ ఓటర్లు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఓటు వేయవచ్చు. ఓట‌రు గుర్తింపు కార్డులేని ఓట‌ర్ల‌కు ఎంపిక చేసిన 21 ఇత‌ర గుర్తింపు కార్డులు ఉన్నా ఓటింగ్ అవ‌కాశం కల్పిస్తాం. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో వృద్దులు, విక‌లాంగుల‌కు ప్ర‌త్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశాం. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో మౌలిక స‌దుపాయాలు కల్పించాం. ( గ్రేటర్‌ వార్‌: పోలీసులు సన్నద్ధం )

మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లలో 1752 హైపర్ సెన్సిటీవ్, 2934 సెన్సిటీవ్, 4415 నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 2,909 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి.  వీటిలో 450 పోలింగ్ లొకేషన్లు హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లుగా ఉన్నాయి. 921 సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లు, 1548 పోలింగ్ లొకేషన్లు నార్మల్‌గా ఉన్నాయి. ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు  52,500 పోలీసులచే బందోబస్తు ఉంటుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాం. 150 పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగిస్తున్నాం. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రంలో ముందు రోజు శానిటైజేషన్ పూర్తి చేస్తాం. ఓటు హక్కు వినియోగించుకునేవారు తప్పకుండా మాస్క్ ధరించాలి. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాల’’ని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement