బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన స్కీములన్నీ బంద్ చేశారు
పట్టణాల రోడ్లన్నీ గుంతలమయం
సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పట్టణాల్లో వీధిదీపాలను కూడా వెలిగించలేని మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి.. తన భాషతో వీధి రౌడీలా తయారయ్యారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పట్టణాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే, రేవంత్రెడ్డి మాత్రం కండ్లకు గంతలు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో దోమల నివారణకు ఫాగింగ్ జరగడం లేదని.. కేవలం ఫ్రాడింగ్ మాత్రమే చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్కీములు బంద్ అయ్యాయని, స్కామ్లు మాత్రం జోరందుకున్నాయని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, గడ్డపోతారం తదితర ప్రాంతాల్లో 15 కార్నర్మీటింగ్లు, రోడ్షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. తన తండ్రి వయసు ఉన్న కేసీఆర్ను పట్టుకుని కనీస గౌరవం లేకుండా, అతినీచమైన భాషను మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ను దూషిస్తే నిరుపేదల కడుపులు నిండవని, సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే పేదల కడుపులు నిండుతాయని సూచించారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తున్న కేసీఆర్ను జైలులో పెడతామని కాంగ్రెస్ అంటోందని హరీశ్రావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల హామీలను అమలు చేస్తామని రేవంత్రెడ్డి రాసిచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఈ రెండున్నరేళ్ల పాలనలో కొత్త పథకాలు ఇవ్వకపోగా, బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను బంద్ చేశారని విమర్శించారు.
సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు అన్నం పెట్టిన కేసీఆర్కు ఓటేస్తారా?, హామీల పేరుతో జనాలకు సున్నం పెట్టిన రేవంత్రెడ్డికి ఓటేస్తారో?.. ప్రజలు ఆలోచన చేయాలని హరీశ్రావు అన్నారు. అసలు ఎవరో.. నకిలీ ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూపాలపల్లిలో చేసిన వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల హామీలను ఎగ్గొట్టిన రేవంత్రెడ్డినే నకిలీ అని అన్నారు.


