
ప్రైవేటు కాలేజీల జమా ఖర్చులపై నివేదిక ఇవ్వాలన్న సీఎం
టాస్క్ ఫోర్స్ తనిఖీల్లోతేలిందేమిటి అంటూ ప్రశ్న.. అధ్యయనం తర్వాత చూద్దామని వ్యాఖ్య
విద్యాశాఖ ఉన్నత అధికారులతో సమీక్ష
గురుకులాలకు తాళాలు, అధికారుల తీరుపై ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపును వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు కాలేజీల జమా ఖర్చుల ప్రతిపాదనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అసలు ఇంజనీరింగ్ ఫీజులు పెంచాల్సిన అవసరం ఉందా? అని కూడా ఆయన అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. శుక్రవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
పాఠశాలల నిర్వహణ, ఇంజనీరింగ్ కాలేజీల కౌన్సెలింగ్ షెడ్యూల్, టీచర్ల సమస్యలు, ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపు, గురుకుల హాస్టళ్ల నిర్వహణ తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా ఇంజనీరింగ్ ఫీజుల విషయమై సీఎం.. అధికారులను అనేక ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ప్రైవేటు కాలేజీలపై గతంలో వేసిన టాస్క్ఫోర్స్ నివేదికలోని అంశాలేంటి? అని నిలదీశారు.
ఫ్యాకల్టీ లేకపోవడం, ఇష్టానుసారం సీట్లు పెంచుకోవడం, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం వంటి అంశాలపై టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో తేలిందేంటని ప్రశ్నించారు. అయితే, అధికారులు ఇందుకు సంసిద్ధంగా లేకపోవడంతో సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ముఖ్యమంత్రి వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సమీక్షకు వచ్చేటప్పుడు కనీసం అవసరమైన నివేదికలతో రావద్దా?’అంటూ ప్రశ్నించారు. ఫీజులకు, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు లింక్ పెట్టడం సరికాదు.. కాలేజీలపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఫీజుల వ్యవహారం చూద్దాం అని అన్నారు.
తాళాలపై తీవ్ర ఆగ్రహం..
అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు బిల్లులు విడుదల చేయలేదని యజమానులు తాళం వేయడంపై సీఎం సీరియస్గా స్పందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత జరుగుతుంటే కనీసం ప్రభుత్వం దృష్టికి ఎందుకు తేలేదని నిలదీశారు. విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నారా? లేదా? అనే అనుమానం కలుగుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్కూళ్ళు రీ ఓపెన్ అయిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను అధికారులు వివరించలేకపోవడం కూడా సీఎంను ఆగ్రహానికి గురి చేసింది.
బడిబాట కార్యక్రమం ఎక్కడా సజావుగా సాగడం లేదని, టీచర్లు దీన్ని సీరియస్గా తీసుకోలేదని, ఉన్నతాధికారులు కూడా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలాచోట్ల పుస్తకాలు, దుస్తులు అందడం లేదని విమర్శలు వస్తున్నా అధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయని, నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు ఇచ్చిన వివరణపై కూడా సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రైవేటు స్కూళ్ళల్లో 25 శాతం ఉచిత సీట్లు ఇచ్చే అంశంపై కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సీఎం ప్రస్తావించారు.
కొత్తగా 571 పాఠశాలలు: సీఎం
ఇరవై మందికన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యాశాఖపై సీఎం శుక్రవారం నిర్వహించిన సమీక్షకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబదీ్ధకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.
నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని.. డే స్కాలర్స్కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కార్యదర్శి మాణిక్ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్మిడియట్ బోర్డు కార్యదర్శి శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నైపుణ్యం పెంచాలి
విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు, నైపుణ్యం పెంచేలా విద్యా వ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. మౌలిక
వసతుల కల్పన, టీచర్లకు శిక్షణ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు.