సెప్టెంబర్ 6న ఉద్యోగుల సంకల్ప సభ | Employee meeting on September 6th | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 6న ఉద్యోగుల సంకల్ప సభ

Aug 30 2026 4:05 AM | Updated on Aug 30 2026 4:05 AM

Employee meeting on September 6th

ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ బకాయిల కోసం సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో సంకల్పసభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో భారీ ‘ఉద్యోగుల సంకల్ప సభ’నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల హక్కులు, పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సంకల్ప సభను విజయవంతం చేసి ప్రభుత్వానికి తమ డిమాండ్లపై స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఉద్యోగులను కోరారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ప్రకటించి వెంటనే అమలు చేయడంతో పాటు ఆరు డీఏ బకాయిలను కూడా విడుదల చేయాలని, అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్‌లను సాధించుకునేందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జేఏసీలోని భాగస్వామ్య సంఘాల ప్రతినిధులతో శనివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, పెండింగ్‌ డిమాండ్లు, భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్‌ వొడ్నాల రాజశేఖర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. సీపీఎస్‌ విధానానికి వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 1న ‘సీపీఎస్‌ విద్రోహ దినం’గా పాటించాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట మధ్యాహ్నం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్‌’ విజయవంతం చేద్దాం
జిల్లాల వారీగా సన్నాహక సమావేశాల షెడ్యూల్‌ విడుదల చేసిన టీఈజేఏసీ 
సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల సమస్యల సాధనకు తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీఈజేఏసీ) సెప్టెంబర్ 10న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని చైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. శనివారం టీఎన్జీఓ భవన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్‌లో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా సన్నాహక సమావేశాల షెడ్యూల్‌ విడుదల చేశారు. 

సెప్టెంబర్ 2న సాయంత్రం 3 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చలో హైదరాబాద్‌ పోస్టర్‌ ఆవిష్కరణ, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా, సంయుక్త సన్నాహక సమావేశం ఉంటుంద న్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటలకు నల్లగొండ జిల్లా, సాయంత్రం 5 గంటలకు మహబూబ్‌నగర్‌ జిల్లా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 5న ఉదయం 11 గంటలకు ఖమ్మం జిల్లా, సాయంత్రం 5 గంటలకు వరంగల్‌ జిల్లా సమావేశాలు, సెప్టెంబర్ 7న ఉదయం 11 గంటలకు మెదక్‌ జిల్లా, సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్‌ జిల్లా సమావేశాలు నిర్వహిస్తామని, సెప్టెంబర్ 8న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా, సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌ జిల్లా సన్నాహక సమావేశాలు జరుగుతాయని వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement