జవాబు పత్రాలు దిద్దే బాధ్యత వేరే స్కూల్‌ టీచర్‌కు | Another school teacher is responsible for marking the answer sheets | Sakshi
Sakshi News home page

జవాబు పత్రాలు దిద్దే బాధ్యత వేరే స్కూల్‌ టీచర్‌కు

Aug 30 2026 4:03 AM | Updated on Aug 30 2026 4:03 AM

Another school teacher is responsible for marking the answer sheets

మండల స్థాయిలో మూల్యాంకనం 

పాఠశాల విద్య మూల్యాంకన విధానంలో మార్పులు 

ఉత్తర్వులు జారీ చేసినపాఠశాల విద్య డైరెక్టరేట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్య మూల్యాంకన విధానం పూర్తిగా మారనుంది. స్కూళ్లల్లో అర్ధ వార్షిక, వార్షిక పరీక్షలుగా నిర్వహించే సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1, 2 జ వాబు పత్రాలను ఇక మీదట బయటి ఉపాధ్యాయుల చేత మూల్యాంకనం చేయిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ శనివారం విడుదల చేశారు. ఇప్పటి వరకూ అదే స్కూల్‌లో పాఠాలు చెప్పే సబ్జెక్టు టీచర్‌ మాత్రమే సమాధాన పత్రాల మూల్యాంకనం చేసి, మార్కులు వేసేవారు. దీనివల్ల ఉపాధ్యాయులు సరిగ్గా సమాధాన పత్రాల మూల్యాంకనం చేయడం లేదని, ఎక్కువ మార్కులు వేస్తున్నారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

ఫలితంగా అన్ని క్లాసుల్లోని విద్యార్థుల నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటోందని అంటున్నారు. వేరే స్కూల్‌ ఉపాధ్యాయుడు పేపర్‌ దిద్దడం వల్ల విద్యార్థి కూడా మరింత అప్రమత్తంగా ఉంటాడని చెబుతున్నారు. ఈ విధానంలో మూల్యాంకనంలో పారదర్శకత, ఏకరూపత, కచ్చితత్వం వస్తుందని పాఠశాల డైరెక్టర్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.  

మూడు విభాగాలుగా ఏర్పాట్లు 
ఒకటి నుంచి పది తరగతుల వరకూ విద్యా సంవత్సరం మొదలైన ఆరు నెలలకు ఎస్‌ఏ–1 పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థి చదివే స్కూల్‌లోనే ఇది ఉంటుంది. సబ్జెక్టులు చెప్పే ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే ఇది జరుగుతుంది. వారే మూల్యాంకనం చేసి, మా ర్కులు వేస్తారు. వార్షిక పరీక్షగా ఎస్‌–2ను 1–9 తరగతులకు నిర్వహిస్తారు. ఇవి కూడా విద్యార్థి చదివే స్కూల్‌లోనే ఉంటాయి. పదవ తరగతి విద్యార్థులకు మాత్రం వేరే కేంద్రంలో పబ్లిక్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పుడు కూడా పది వార్షిక పరీక్షలు మినహా మిగతావన్నీ స్కూల్‌లోనే ఉంటాయి. పరీక్షలు చేపట్టిన తర్వాత సంబంధిత స్కూల్‌ ప్రధానోపాధ్యాయడు విద్యార్థుల జవాబు పత్రాలను సీల్డ్‌ కవర్‌ ద్వారా మండల రిసోర్స్‌ కేంద్రానికి పంపుతాడు. 

ఈ కేంద్రానికి బాధ్యుడుగా మండల విద్యాశాఖాధికారి ఉంటారు. ఎంఈఓ స్థాయిలో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన టీచర్లను మూల్యాంకనానికి నియమిస్తారు. ప్రతీ పేపర్‌కు ప్రాథమిక విద్య వరకూ రూ.2, ఉన్నతవిద్య పేపర్లు అయితే రూ.3 ఇస్తారు. స్కూళ్ల నుంచి వచ్చిన పేపర్లను 3 నుంచి ఐదు రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. జవాబు పత్రాలను మండల విద్యాశాఖ కార్యాలయం భద్రపర్చాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

కొత్త తలనొప్పులే 
ఈ విధానం కొత్త తలనొప్పులు తెస్తుందని ఉపాధ్యాయులు అంటున్నారు. విద్యార్థి తన పర్యవేక్షణలో పరీక్ష రాసినప్పుడు, తాను చెప్పిందేంటో? విద్యార్థి రాసిందేంటో స్పష్టత ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల సరైన విధానంలో మార్కులు వేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రశ్నపత్రాలు వేరే చోటుకు పంపడం, ఇతర టీచర్లను మూల్యాంకనం కోసం నియమించడం వల్ల సమయం వృథా అవుతుందని, స్కూళ్లల్లో విద్యాబోధనకూ కొన్ని రోజులు ఆటంకం ఏర్పడుతుందని చెబుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement