సింగరేణిలో పోరు సైరన్‌ | Election schedule of Singareni recognition labor union has been finalized | Sakshi
Sakshi News home page

సింగరేణిలో పోరు సైరన్‌

Sep 28 2023 2:27 AM | Updated on Sep 28 2023 3:11 PM

Election schedule of Singareni recognition labor union has been finalized - Sakshi

ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం/కరీంనగర్‌: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైంది. సింగరేణి కార్మిక సంఘాలు, యాజమాన్యం ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ సమావేశమైంది. తీవ్ర ఉత్కంఠల నడుమ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ చీఫ్‌ లేబర్‌కమిషనర్‌ (సెంట్రల్‌) శ్రీనివాసులు షెడ్యూల్‌ ప్రకటించారు.  

ఎన్నికల నిర్వహణ ఇలా: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబర్‌ 28న నిర్వహిస్తారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాను ఈనెల 30న ప్రకటిస్తారు. అభ్యంతరాల స్వీకరణ, మార్పులుచేర్పుల తర్వాత తుది జాబితా అక్టోబర్‌ 5న విడుదల చేస్తారు.

6, 7 తేదీల్లో సాయంత్రం 5గంటల వరకు హైదరాబాద్‌లోని డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ ఆఫీస్‌లో నామినేషన్లు స్వీకరిస్తారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 10న గుర్తులు కేటాయిస్తారు. 28న సింగరేణి సంస్థ విస్తరించిన 11 ఏరియాలు, కార్పొరేట్‌ లో పోలింగ్‌ జరుగుతుంది. సింగరేణిలో ప్రస్తుతం 42,390 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

వాయిదాకు ససేమిరా: హైకోర్టు తీర్పు అనుసరించి గుర్తింపు సంఘం ఎన్నికలపై బుధవారం హై దరాబాద్‌లో జరిగిన సమావేశంలో హైడ్రామా చో టు చేసుకుంది. మొత్తం 16 కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు జరిపింది. ఏఐటీయూసీ, బీఎంఎస్‌ కోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వ హించాలని తమ అభిప్రాయం తెలిపాయి. టీబీజీకేఎస్‌తో పాటు మరికొన్ని సంఘాలు ఎన్నికలు వాయిదా వేయాలన్నాయి. కొందరు కార్మిక సంఘాల ప్రతినిధులు తటస్థంగా ఉన్నా రు. దీంతో కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం తీసుకొని ఎన్నికలు వాయిదా వేసేందుకు యాజమాన్యం తరఫున హాజరైన ప్రతినిధులు చర్చలు ప్రారంభించారు.

వాయిదాపై ఏకాభిప్రాయం వస్తే కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేద్దామంటూ మంతనాలు సాగించారు. అయితే సమావేశం చివరివరకు కూడా ఎన్నికల వాయిదాకు ఏఐటీయూ సీ, బీఎంఎస్‌లు అంగీకరించలేదు. ఎన్నికలు నిర్వహించాల్సిందేన ని పట్టుబట్టాయి. దీంతో కోర్టు తీర్పు ప్రకారం ఎ న్నికల షెడ్యూల్‌ జారీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. 

ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా?  
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికార యంత్రాంగం పూర్తిగా తలమునకలై ఉంది. సింగరేణి ఎన్నికల నిర్వహణ కష్టమే అంటూ ఇదివరకే ఆ జిల్లాల పరిదిలోని అధికారులు చేతులెత్తేశారు. మెజారిటీ సంఘాలు కూడా ఎన్నికల వాయిదాకే పట్టుబట్టాయి. ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో కేసు పెండింగ్‌లో ఉంది. 2 దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక జాతీయస్థాయి రెస్క్యూ పోటీలు నిర్వహించే అవకాశం సింగరేణికి లభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న 20కిపైగా బొగ్గుగనుల బృందాలు రానున్నాయి. ఇదే కాకుండా అతి కీలకమైన 54వ రక్షణ వారోత్సవాలకు సంస్థ సన్నద్ధమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement