అవి అవ్వ-తాతల సంఘాలు.. కొడుకు, కోడళ్లతో ఎలా మెలగాలో చెబుతాయి.. | Sakshi
Sakshi News home page

అవి అవ్వ-తాతల సంఘాలు.. కొడుకు, కోడళ్లతో ఎలా మెలగాలో చెబుతాయి..

Published Thu, Dec 23 2021 12:23 PM

Elderly Communities In Komatipally Village, Nizamabad - Sakshi

జీవితాంతం కనాకష్టం చేసి.. చరమాంకంలో తమకంటూ ఏమీ మిగుల్చుకోని స్థితి వృద్ధులది. పెద్దలు చెప్పింది పిల్లలు వినరు. ‘అత్త మూతి విరుపు... మామ చాదస్తం’ అంటారు. అలాగే పిల్లల చేతలు పెద్దలకు నచ్చవు. ‘కొడుకు పట్టించుకోడు.. కోడలు సూటి పోటి మాటలు’ అని పుట్టడన్నీ ఫిర్యాదులు. ఇలా చిన్నచిన్న ఇబ్బందులతో మొదలైన మాటలు పంచాయతీ దాకా వస్తుంటాయి. చివరికి పెద్ద మనుషులనో, పోలీసు స్టేషన్ల నో ఆశ్రయించాల్సిన పరిస్థితి చాలా కుటుంబాలది. అయితే  కామారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఈ సీన్‌ కనిపించదు. అక్కడ పండుటాకులంతా సం ఘటితమయ్యారు. వృద్ధాప్యంలో ఒకరికొకరై, అందరూ ఒకటై... ఆపద వస్తే ధైర్యాన్నిస్తారు. తల్లిదండ్రులను పట్టించుకోని బిడ్డలకు బుద్ధి చెబుతారు.  

సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని మోతె గ్రామంలో వృద్ధులు గాంధీ మహాత్ముని స్ఫూర్తితో 2009లో ‘తాత సంఘం’స్థాపించారు. 60 ఏళ్లు పైబడిన 60 మందితో మొదలైన సంఘం ఇప్పుడు 108 మందికి చేరింది. ప్రతి నెల రూ.పది చొప్పున జమ చేస్తారు. సంఘం కోసం షెడ్డు నిర్మించుకున్నారు. గాంధీ విగ్రహంతోపాటు అందరి పేర్లతో రూపొందించిన శిలాఫలకాన్నీ పెట్టుకున్నారు. ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్ల తో ఎలా మెలగాలనేది చర్చించుకుంటారు.
చదవండి: తెలంగాణలో రికార్డ్‌: తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ సలీమా 

కోమట్‌పల్లిలో తాత, అమ్మల సంఘం
లింగంపేట మండలం కోమట్‌పల్లిలో 2018లో ‘తాత, అమ్మ’ల సంఘం ఏర్పాటైంది. ఇందులో 93 మంది సభ్యులున్నారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు సంగయ్య సహకారంతో సంఘాన్ని బలోపేతం చేసుకున్నారు. సభ్యులు ప్రతినెల ఒక్కొక్కరూ రూ. 50 సంఘంలో జమ చేస్తారు. ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉంటారు. సమస్య వస్తే కలిసి పరిష్కరించుకుంటున్నారు. 
చదవండి: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

దేమికలాన్‌లో వయో వృద్ధుల సంఘం
తాడ్వాయి మండలం దేమికలాన్‌లో 2017లో ‘పార్వతీ దేవి వయో వృద్ధుల సంక్షేమ సంఘం’ఏర్పాటైంది. 40 మందితో మొదలైన సంఘం ఇప్పు డు 80 మందికి చేరింది. ఇందులో పది మంది మహిళలు ఉన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ రూ.పది తీసుకుని సమావేశానికి వస్తారు. సంఘం సభ్యుల విరాళాలు, ప్రభుత్వ నిధులతో కలిపి రూ.5 లక్షలతో భవనం నిర్మించుకున్నారు. అప్పటి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సహాయం తో ఫర్నీచర్‌ను సమకూర్చుకున్నారు. ప్రతి రోజూ అక్కడకు వచ్చి సాదకబాధకాలు పంచుకుంటారు.

Advertisement
Advertisement