8 నెలల్లో ఇంటింటికీ ఇంటర్నెట్‌ | Sridhar Babu Says Door To Door Internet In 8 Months, We Provide Tv, Internet And Phone Services At Low Cost | Sakshi
Sakshi News home page

8 నెలల్లో ఇంటింటికీ ఇంటర్నెట్‌

Dec 9 2024 6:11 AM | Updated on Dec 9 2024 9:40 AM

Door to door internet in 8 months: Sridhar Babu

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ తీసుకొస్తాం

టీ–ఫైబర్‌ ఆధ్వర్యంలో తక్కువ ధరకే టీవీ, ఇంటర్నెట్, ఫోన్‌ సేవలు అందిస్తాం 

ప్రయోగాత్మకంగా 3 గ్రామాల్లో ఇంటర్నెట్‌ సేవల ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు 

 రైతులకు పంట రుణాల కోసం యాప్, మీ–సేవలోకి కొత్తగా 9 సర్వీసులు.. యాప్‌ ఆవిష్కరణ 

మంత్రి సమక్షంలో రూ. 7,592 కోట్ల పెట్టుబడులతో 3 పరిశ్రమల ఎంవోయూలు

సాక్షి, హైదరాబాద్‌: టీ–ఫైబర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని అన్ని ఇళ్లకు వచ్చే 6–8 నెలల్లో తక్కువ ధరకే హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీతోపాటు డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రకటించారు. దీనివల్ల ప్రతి ఇంట్లో టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్‌తోపాటు కంప్యూటర్‌ ఆధారిత అన్ని రకాల సేవలు అందుబాటులో వస్తాయన్నారు.

ఇప్పటికే అన్ని గ్రామాలకు ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు పనులు పూర్తికావొచ్చాయని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మద్దూరు (కొడంగల్‌ నియోజకవర్గం), సంగంపేట (అందోల్‌), అడవి శ్రీరాంపూర్‌ (మంథని) గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చిన టీ–ఫైబర్‌ ఇంటర్నెట్‌ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులతో వర్చువల్‌గా సంభాషించి అభినందనలు తెలిపారు. అలాగే పరిశ్రమల శాఖ ప్రవేశపెట్టిన పలు యాప్‌లను ఆయన ఆవిష్కరించారు. 

ఇక 2 రోజుల్లో పంట రుణాలు.... 
రైతులు పంట రుణాలు పొందడానికి ప్రస్తుతం 30 రోజుల సమయం పడుతుండగా కొత్తగా ఆవిష్కరించిన స్మార్ట్‌ అగ్రి క్రెడిట్‌ సర్విస్‌ యాప్‌ ద్వారా కేవలం 2 రోజుల్లోనే పొందవచ్చని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అలాగే రైతులు వాయిస్‌ కమాండ్‌ ద్వారా ఎరువులు, క్రిమికీటకాల నివారణ వంటి అంశాల్లో సూచనలను సైతం పొందవచ్చని చెప్పారు. డ్రగ్స్‌పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కలి్పంచడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో ‘మిత్ర–తెలంగాణ’అనే మరో యాప్‌ను తీసుకొచ్చామన్నారు. 

ఇక యాప్‌ ద్వారా మీ–సేవ మీ–సేవ విస్తరణలో భాగంగా స్టడీ గ్యాప్‌ 
సర్టిఫికెట్, పేరు మార్పు, లోకల్‌ క్యాండిడేట్, మైనారిటీ, ఇన్‌కమ్, క్యాస్ట్, క్రీమీలేయర్‌/నాన్‌ క్రీమీలేయర్‌ సరి్టఫికెట్లతోపాటు సీనియర్‌ సిటిజన్స్‌ మెయింటెనెన్స్‌ ఫిర్యాదులు, వణ్యప్రాణుల దాడిలో మరణించే వ్యక్తులు, పశువులకు నష్టపరిహారం, టింబర్‌ డిపో/సామిల్స్‌కు పరి్మట్ల జారీ/రెన్యూవల్‌ కలిపి మొత్తం 9 సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీధర్‌బాబు తెలిపారు.

కొత్తగా ఆవిష్కరించిన మీ–సేవ యాప్, ‘కియోస్‌్క’లతో సైతం ఇప్పటికే మీ–సేవ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 400కిపైగా సేవలను ప్రజలు పొందొచ్చని వివరించారు. టీ–వర్క్స్‌–బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ నేషనల్‌ సెక్యూరిటీ(సీఆర్‌ఈఎన్‌ఎస్‌)ని మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్య అన్వేషణ, అభివృద్ధికి ‘రూరల్‌ వర్క్స్‌’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు.

రూ. 7,592 కోట్ల పెట్టుబడులతో 3 మెగా పరిశ్రమలు
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, విస్తరణకు రూ. 7,592 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన 3 కంపెనీలతో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో పరి శ్రమల శాఖ 4 పరస్పర అవగాహన ఒప్పందా (ఎంవోయూ)లు కుదుర్చుకుంది. ఆయా సంస్థల ఏర్పాటుతో 5,200 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. సీతారాంపూర్‌లో 4 గిగావాట్ల సౌర విద్యుత్‌ పరికరాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న ‘ప్రీమియర్‌ ఎనర్జీస్‌’.. వ్యాపార విస్తరణలో భాగంగా రూ. 1,950 కోట్లతో సోలార్‌ ఇంగాట్స్‌ అండ్‌ అల్యూమినియం ప్లాంట్‌ ఏర్పా టు చేసేందుకు, మరో రూ. 3,342 కోట్ల పెట్టుబడితో 4 గిగావాట్ల సోలార్‌ పీవీ టాప్కాన్‌ సెల్, 4 గిగావాట్ల సోలార్‌ పీవీ టాప్కాన్‌ మాడ్యూల్స్‌ తయారీ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చిందన్నారు.

అలాగే రూ. 1,500 కోట్లతో ‘లెన్స్‌కార్ట్‌’ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లద్దాలు, అనుబంధ ఉత్ప త్తుల తయారీ హబ్‌ను ఫ్యాబ్‌సిటీలో ఏర్పాటు చేయనుందని వివరించారు. ఆజా ద్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఘణపూర్‌లో రూ. 800 కోట్లతో సూపర్‌ అల్లాయ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రగతిని అడ్డుకోవడానికి చాలా మంది విషప్రచారం చేసినా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తాము తెచ్చిన పాలసీకి విశేష స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో త్వరలో 2 వేల ఎకరాల్లో రూ. 1,500 కోట్లతో కొత్తగా 12 మినీ ఇండస్ట్రీయల్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement