అసలే ఇరుకు..ఆపై సైకిల్‌ ట్రాక్‌ | Cycling track set up at KBR Park | Sakshi
Sakshi News home page

అసలే ఇరుకు..ఆపై సైకిల్‌ ట్రాక్‌

May 24 2023 10:50 AM | Updated on May 24 2023 11:09 AM

Cycling track set up at KBR Park  - Sakshi

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు చుట్టూ ప్రధాన రహదారిని కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌(సీఆర్‌ఎంపీ) ఏజెన్సీ నిర్వహిస్తోంది. రోడ్లపై గుంతలు పడినా, ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్నా కొత్తగా రోడ్డు వేయాలన్నా, తవ్వాలన్నా సీఆర్‌ఎంపీ నిర్వహణలోనే చేపట్టాలి. అయితే గత కొంత కాలంగా కేబీఆర్‌ పార్కు చుట్టూ సైకిల్‌ ట్రాక్‌  నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగా  రెండేళ్లుగా ఫుట్‌పాత్‌లను ఆనుకుని సైకిల్‌ ట్రాక్‌ బొల్లార్డ్స్‌ కోసం గుంతలు తీశారు. వర్షాలకు ఈ గుంతలు నిండిపోయి పార్కుకు వచ్చే వాకర్లు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం పేరుతో పార్కు చుట్టూ సదరు సంస్థ రోడ్డును ఛిద్రం చేసింది. నాలుగైదు సార్లు గుంతలు తీసి పూడ్చి రూ. లక్షల్లో నిధులు వృథా చేశారు. జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా పార్కు చుట్టూ సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే పార్కు చుట్టూ రోడ్డు ఇరుగ్గా ఉందని ఈ సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం చేపడితే సమస్య జఠిలంగా మారుతుందని, వాహహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని కేబీఆర్‌ పార్కుకు వచ్చే వాకర్లు, సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. తక్షణం పార్కుచుట్టూ సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణ పనులు నిలిపివేయాలని తీసిన గుంతలను పూడ్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. సీఆర్‌ఎంపీ నిర్వాకంతో పార్కు చుట్టూ రోడ్డు అధ్వానంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement