
సైబర్ నేరగాళ్ల వలకు చిక్కకుండా తప్పించుకున్న నగరవాసి
మీ కూతురు డ్రగ్స్ కేసులో ఉందంటూ
హోం సెక్రెటరీ ఫొటో డీపీగా పెట్టి బెదిరింపులు
సమయస్ఫూర్తితో వ్యవహరించి తప్పించుకున్న వైనం
సాక్షి, హైదరాబాద్: ‘మీ కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది. ఈ కేసు నుంచి మీ కూతుర్ని తప్పించాలంటే మేం చెప్పిన ఫోన్పే నంబర్కు రూ.50 వేలు వెంటనే పంపండి’అంటూ బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు విశ్వ ప్రయత్నం చేశారు. అయితే వారి వలకు చిక్కకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు నగరవాసి శ్రీనివాస్రెడ్డి. కేసు వివరాల్లోకి వెళితే..సరూర్నగర్కు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థను నడిపే శ్రీనివాస్రెడ్డికి ఈనెల 19న ఒక వాట్సప్ కాల్ వచ్చింది.
అందులో పేరు సీబీఐ విక్రమ్గా..డీపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఫొటో ఉంది. అవతలి నుంచి ఒక మహిళ ఇంగ్లిష్ లో మాట్లాడుతూ.. మీ కూతురు కెనడాలో డ్రగ్స్ కేసులో పట్టుబడింది అని చెప్పింది. వెంటనే డబ్బులు పంపితే ఆమెను ఈ కేసు నుంచి వదిలేస్తామని లేదంటే థర్డ్ డిగ్రీ తప్పదని బెదిరించడం ప్రారంభించింది. ఫోన్ పే చేయాలంటూ ఒక నంబర్ ఇచ్చింది.
పదేపదే డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుండడంతో అనుమానించిన శ్రీనివాస్రెడ్డి ఆ వాట్సప్ కాల్ను కట్ చేసి, కెనడాలో ఉన్న కూతురుకు ఫోన్ చేశారు. ఇంట్లోనే నిద్రపోతున్నానని..తాను క్షేమంగానే ఉన్నానని...ఎలాంటి సమస్య లేదని కూతురు చెప్పింది. దీంతో తన అనుమానం నిజమైందని గుర్తించిన శ్రీనివాస్రెడ్డి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు చేసిన ఫోన్ నంబర్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. తనను మోసగించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్రెడ్డి తన ఫిర్యాదులో కోరారు. టీజీ సీఎస్బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.