‘క్వాంటమ్‌’ పేర.. లాభాల ఎర | Cybercrime with Deep Fake Videos | Sakshi
Sakshi News home page

‘క్వాంటమ్‌’ పేర.. లాభాల ఎర

Jun 3 2026 2:38 AM | Updated on Jun 3 2026 2:38 AM

Cybercrime with Deep Fake Videos

డీప్‌ ఫేక్‌ వీడియోలతో దగా

రూ. 22 వేల పెట్టుబడితో నెలకు రూ. 3 లక్షలు.. 

ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే రూ. 40 లక్షల రాబడి అంటూ ప్రకటనలు  

నిర్మలా సీతారామన్, సుధామూర్తి పేరిట ఫేస్‌బుక్, ఇన్‌స్టా్రగామ్‌ల్లో వీడియోలు 

మోసపోయిన పలువురు.. 

అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు

హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన 74 ఏళ్ల రిటైర్డ్‌ మహిళా వైద్యురాలు సోషల్‌ మీడియాలో నిర్మలా సీతారామన్‌ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు కనిపించిన నకిలీ వీడియోను చూసి మోసపోయారు. ఆ వీడియోలో చూపిన ట్రేడింగ్‌ ప్లాట్‌ఫారమ్‌పై నమ్మకం పెంచుకున్న ఆమె.. జూలై నుంచి డిసెంబర్‌ 2025 మధ్య 11 విడతల్లో రూ.68.3 లక్షలు పెట్టుబడి పెట్టారు. డబ్బు ఉపసంహరించుకునే సమయంలో మోసం జరిగినట్టు గుర్తించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

సాక్షి, హైదరాబాద్‌: సులువుగా డబ్బు సంపాదించాలన్న కొందరి అత్యాశను తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు సైబర్‌ నేరగాళ్లు. తాజాగా ‘క్వాంటమ్‌ ఏఐ’లో పెట్టుబడులు పెడితే రూ.లక్షల్లో లాభాలు వస్తాయని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రజలను నమ్మించేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ స్వయంగా ఈ ప్రకటన ఇస్తున్నట్టుగా డీప్‌ఫేక్‌ వీడియోను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు బాగా పెరిగాయి. కేవలం నిర్మలాసీతారామన్‌వే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త సుధామూర్తి ఇతర ప్రముఖుల ఫొటోలు, వీడియోలను దుర్వినియోగం చేసి ఇలాంటి ఫేక్‌ వీడియోలతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇవన్నీ పూర్తిగా నకిలీవేనని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఇప్పటికే స్పష్టం చేసింది. క్వాంటమ్‌ ఏఐ పేరుతో సోషల్‌ మీడియాలో జరుగుతున్న పెట్టుబడి మోసాలపై నిర్మలాసీతారామన్‌ బహిరంగంగా హెచ్చరించారు. తనకు సంబంధించిన పలు డీప్‌ఫేక్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  

ఎలా మోసం చేస్తున్నారు?  
సైబర్‌ నేరగాళ్లు ముందుగా ప్రముఖుల పేర్లతో నకిలీ వార్తా కథనాలు, డీప్‌ఫేక్‌ వీడియోలు తయారు చేస్తున్నారు. ఆ వీడియోల్లో ప్రముఖులు స్వయంగా పెట్టుబడి పెట్టి భారీ లాభాలు పొందినట్టు చూపిస్తున్నారు. ఆ ప్రకటనల్లో ‘రూ.22 వేల పెట్టుబడితో నెలకు రూ.3 లక్షల ఆదాయం’, ‘రూ.22 వేల పెట్టుబడికి రూ.40 లక్షల రాబడి’, ‘ప్రభుత్వ హామీతో క్వాంటమ్‌ ఏఐ’వంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల్లో వచ్చే ఆ ప్రకటనల్లో మీరూ ఈ లాభాలు పొందాలంటే ప్రకటనల్లోని లింక్‌లపై క్లిక్‌ చేయండి అని సూచిస్తున్నారు. తర్వాత ఇప్పుడే నమోదు చేసుకోండి అనే లింక్‌పై క్లిక్‌ చేయిస్తారు. బాధితుడు మొబైల్‌ నంబర్, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన వెంటనే కాల్‌ సెంటర్‌ తరహాలో మోసగాళ్లు సంప్రదించి కనీసం రూ.17 వేల నుంచి రూ.22 వేల వరకు పెట్టుబడి పెట్టమని ఒత్తిడి తెస్తారు. ఇలా ఒకసారి వారి వలకు చిక్కిన తర్వాత మొదట్లో కొద్దిమేర లాభాలు వచ్చినట్టుగా చూపి..ఆ తర్వాత క్రమంగా పలు రకాల ప్రాసెసింగ్‌ ఫీజులు, ఇతర చార్జీలు అంటూ అవకాశం ఉన్నంత మేర వారి ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్నారు.  

ఆ వీడియోలు చూసి మోసపోవొద్దు  
సైబర్‌ నేరగాళ్లు మొదట ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఉన్న ప్రముఖుల వీడియోలను తీసుకొని వాటిని డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో మార్పులు చేస్తున్నారు. క్వాంటమ్‌ ఏఐకి సంబంధించి వారు మాట్లాడుతున్నట్టుగా డీప్‌ఫేక్‌ వీడియోలు రూపొందించి వాటిని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత బాధితుల వాట్సాప్, టెలిగ్రామ్‌ గ్రూపులకు ఈ లింక్‌లను పంపుతున్నారు. ఇలాంటి అనుమానాస్పద ప్రకటనల విషయంలో నమ్మొద్దని, ఆ తరహా వీడియో ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

ఈ జాగ్రత్తలు తప్పనిసరి 
– తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలను నమ్మొద్దు. 
– ప్రముఖుల పేర్లు, ఫొటోలు ఉన్నాయనే కారణంతో పెట్టుబడి పెట్టొద్దు. 
– పెట్టుబడి సంస్థ సెబీ వద్ద నమోదు అయిందో లేదో పరిశీలించాలి. 
– అనుమానాస్పద లింకులు క్లిక్‌ చేయకుండా ఉండాలి. 
– మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి లేదా జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి.  
పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం పలుమార్లు ప్రజలను అప్రమత్తం చేసింది. కేంద్ర మంత్రులు, రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారులు లేదా ప్రముఖ వ్యాపారవేత్తలు పెట్టుబడి సలహాలు ఇస్తున్నట్టు కనిపించే వీడియోలు, ప్రకటనలను నమ్మొద్దని హెచ్చరించింది. డీప్‌ఫేక్‌ సాంకేతికతతో వీడియోలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement