కొమురవెల్లి ఆలయంలో ఒగ్గు పూజారుల నియామక దందా
కొత్తగా 55 మంది నియామకానికి చకచకా ఏర్పాట్లు
ఆరు నెలల క్రితం ఓ అధికారి వద్దన్నా.. కొత్త అధికారి రాకతో కదిలిన పావులు
ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల దాకా వసూలు?
ఇప్పటికే 163 మంది ఒగ్గు పూజారులు.. ఆలయ ఆదాయంలో వీరికి 50% వాటా
సాక్షి, హైదరాబాద్: దేవుడి ఆదాయంపై ప్రభావం చూపించే ఆ నిర్ణయాన్ని ఓ ఉన్నతాధికారి తిరస్కరించారు. కానీ ఆ అధికారి బదిలీ కాగానే మరో అధికారి దాని అమలుకు రంగం సిద్ధం చేశారు. దాని వెనుక రూ.కోటిన్నర కమీషన్కు బేరం కుదిరిందని, ఇందుకు ఓ దళారీ చక్రం తిప్పాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ దళారీ ఓ ఉన్నతాధికారి కోటరీ మనిషని తెలుస్తోంది. ప్రధాన పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఈ అవినీతి తంతు జరుగుతోంది. ఆలయం పరిధిలో అధికారికంగా నమోదైన 163 మంది ఒగ్గు పూజారులకు అదనంగా మరో 55 మందిని నియమించుకునేందుకు వీలుగా ఫైల్ కదిలి కమిటీ ఏర్పాటు కాగా..ఇందుకు గాను ఒక్కో ఒగ్గు పూజారి రూ.3 లక్షలు ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఆరు నెలల కిందే వద్దన్నా..
ఈ అవినీతి దందాకు గత జనవరిలోనే తెరలేచింది. అయితే అప్పట్లో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి వారి నియామకానికి అడ్డు చెప్పారు. ప్రస్తుత భక్తుల రద్దీకి చాలినంత మంది ఒగ్గు పూజారులు ఉన్నందున కొత్తవారి నియామకం అవసరం లేదని, వారిని నియమిస్తే దేవుడి ఖజానాకు రావాల్సిన టికెట్ ఆదాయంలో సగం వారి వాటాగా మళ్లి నష్టం వాటిల్లుతుందని చెప్పారు. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా నాటి దేవాలయ కార్యనిర్వహణాధికారిని ఆదేశించగా, ఆయన కూడా ఇదే అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా సమర్పించారు. దీంతో ఈ ప్రతిపాదనను దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం తిరస్కరించింది. అయితే ఇటీవల అడ్డు చెప్పిన ఆ ఉన్నతాధికారి బదిలీ కావటంతో ఆయన స్థానంలోకి వచ్చిన మరో అధికారి పాత ప్రతిపాదనను తిరగదోడటంతో ఫైలు చకచకా కదిలిందనే చర్చ జరుగుతోంది.
చక్రం తిప్పిన దళారీ..
దేవాదాయ శాఖ ఉన్నతాధికారి కోటరీ మనిషి అయిన రిటైర్డ్ ఉద్యోగి ఒకరు 55 మంది ప్రతిపాదిత ఒగ్గు పూజారి అభ్యర్థులతో కమీషన్ బేరాలు కుదిర్చినట్టు తెలుస్తోంది. వారికి అధికారిక గుర్తింపు ఇచ్చేలా మమ అనిపించేందుకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, రీజినల్ జాయింట్ కమిషనర్, వరంగల్ డిప్యూటీ కమిషనర్, దేవాలయ కార్యనిర్వహణాధికారి, మెదక్ సహాయ కమిషనర్, ఒగ్గు పూజారుల సంఘం అధ్యక్షుడితో కమిటీ ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఒగ్గు పూజారులు నేరుగా దేవాదాయ శాఖ నియమించే అర్చకులు కాదు. ఆ దేవాలయ జాబితాలో అధికారికంగా పేరు నమోదు చేసుకుంటే.. ప్రధాన దేవాలయం వెలుపల భక్తులు నిర్వహించే స్వామివారి కళ్యాణోత్సవ పట్నాలు జరిపించేందుకు వీలవుతుంది.
ఏమిటీ పట్నాలు..?
మరే దేవాలయంలో లేని పట్నాల సంప్రదాయం ఇక్కడుంది. పూజల్లో భాగంగా వేసే ప్రత్యేక తరహా ముగ్గునే ‘పట్నం’గా పేర్కొంటారు. ముఖ మండపం వద్ద నిర్వహించేదాన్ని ముఖ మండప పట్నమని, అక్కడి పవిత్ర గంగరేవి చెట్టు వద్ద వేసే పట్నాన్ని నజర్ పట్నమని, భక్తులు ఉండే ఆవాసాల వద్ద వేసే పట్నాన్ని చిలుక పట్నమని పిలుస్తారు. వీటి కోసం భక్తులు ఆలయానికి రుసుము చెల్లించి రశీదు పొందాలి. అలా రుసుముల రూపంలో వచ్చిన ఆదాయంలో 50 శాతాన్ని ఈ ఒగ్గు పూజారులకు ఆలయం చెల్లిస్తుంది.
ఆదాయంలో సింహభాగం పూజారులకే..
దేవాలయ నిర్వహణకు వాడాల్సిన ఖజానా ఆదాయంలో సింహభాగం, ఒగ్గు పూజారులకే వెళుతుందన్న మాట. అలా ప్రస్తుతం టికెట్ల రూపంలో ఏటా వచ్చే దాదాపు రూ.4 కోట్ల ఆదాయంలో సగం వారికే చేరుతోంది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. పూజారులకు వెళ్లే మొత్తం కూడా పెరుగుతుంది. అయితే ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన..’అన్న చందాన పూజారుల సంఖ్య పెరిగేకొద్దీ ప్రస్తుతం ఉన్న పూజారులకు ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పటికే తమ ఆదాయం సరిపోవటం లేదని, తమకు చెల్లిస్తున్న వాటాను 50 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని గతంలో పూజారులు డిమాండ్ చేశారు. కానీ దేవాదాయ శాఖ తిరస్కరించింది. ఇప్పుడు పూజారుల సంఖ్య మరింత పెరిగితే ఆ ప్రతిపాదనకు అంగీకరించాల్సిన పరిస్థితి ఉంటుందని, అప్పుడు ఆలయ ఆదాయం భారీగా తగ్గిపోతుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. వాస్తవానికి కేవలం నాలుగైదు నెలలు మాత్రమే వీరికి పని ఉంటుంది. ఇప్పుడు పూజారుల పెంపు అవసరం లేనప్పటికీ కమీషన్లు దండుకునేందుకే నియామకాలకు తెరతీశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.


