Congress Leaders And Political Circles Analysis Of Munugode Bypoll 2022 - Sakshi
Sakshi News home page

డిపాజిట్‌ పోయినా.. కేడర్‌ నిలబెట్టింది!

Nov 7 2022 1:30 AM | Updated on Nov 7 2022 11:15 AM

Congress Leaders And Political Circles Analysis Of Munugode Bypoll 2022 - Sakshi

ఖాళీగా దర్శనమిస్తున్న కాంగ్రెస్‌ కార్యాలయం 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభావంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, నల్లగొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలో ఆ పార్టీకి ఉన్న పట్టు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్‌కు ఇది మిశ్రమ ఫలితమేననే అభి ప్రాయం వ్యక్తమవుతోంది.

పార్టీ ఎమ్మె ల్యే రాజీనామా చేసి వేరే పార్టీ నుంచి పోటీ చేసినందునే దెబ్బ­తిన్నామని కాంగ్రెస్‌ నేతలు చెపు­తున్నా..డిపాజిట్‌ కోల్పోవడం చిన్న విషయమేమీ కాదని, ఇది కాంగ్రెస్‌ పార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయితే, ఆ మాత్రం ఓట్లు వచ్చాయంటే కాంగ్రెస్‌ పార్టీని కేడర్‌ నిలబెట్టిన ట్టేనని, టీఆర్‌ఎస్‌– బీజేపీల మధ్య హోరా­హోరీగా పోరు సాగినప్పటికీ కాంగ్రెస్‌ కేడర్‌ స్థైర్యాన్ని కోల్పోకుండా పనిచేయడం వల్లనే 24 వేల వరకు ఓట్లు వచ్చాయనే చర్చ జరుగుతోంది. 

అప్పటికి మెరుగుపడతాం..
రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు చెందిన మెజారిటీ కేడర్‌ను తన వెంట తీసుకుపోవడంతో పార్టీకి దెబ్బ తగిలిందని, నువ్వా.. నేనా.. అనే స్థాయిలో టీఆర్‌ఎస్, బీజేపీలు పోటీ పడటం, అదీ ఉప ఎన్నిక కావడంతో సంప్రదాయ ఓటర్లు బీజేపీ (రాజగోపాల్‌రెడ్డి) వైపు మొగ్గుచూపారే తప్ప సాధారణ ఎన్నికలు జరిగిన ప్పుడు ఈ పరిస్థితి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది.

హుజూరా బాద్‌లో జరిగిన ఎన్నికలో 3 వేల ఓట్లు మాత్రమే సాధించిన పరిస్థితి నుంచి, హోరాహోరీ పోరాటంలో 24 వేల వరకు ఓట్లు సాధించడం చెప్పుకోద గినదేనని, సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఇంత ఫోకస్‌ చేయలేదు కనుక తమ పరిస్థితి మరింత మెరుగవు తుందనే అభిప్రాయం కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. మెజార్టీ నియోజకవర్గాల్లో తమ పార్టీ బలం పదిలంగానే ఉందని ధీమాను కూడా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 

అప్పటి ఓట్లు కూడా రాలేదు
2014లో పాల్వాయి స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 27 వేల ఓట్లు పోలవగా, ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా 24 వేల లోపు ఓట్లు మాత్రమే రావడం కూడా చర్చనీయాంశమవుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు వచ్చిన ఓట్లు కూడా పార్టీ పక్షాన నిలిచినప్పుడు రాకపోవడంపై కాంగ్రెస్‌లో అంతర్గతంగా గుబులు మొదలైంది.

డిపాజిట్‌ కోల్పోవడం, మూడోస్థానానికి దిగజారడంతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమన్న నినాదానికి గండి పడిందా అనే చర్చ కూడా జరుగుతోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి చవిచూడడంతో పాటు డిపాజిట్లు కోల్పోవడంపై కూడా నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

పార్టీ పక్షాన వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్‌ కనుగోలు వ్యూహాలు కూడా పనిచేయడం లేదని ఈ ఫలితంతో అర్థమవుతోందని, చివరి క్షణంలో మహిళా గర్జన పెట్టకపోతే ఈ మాత్రం ఓట్లు కూడా వచ్చేవి కావని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఉప ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ నాయకుడు మాట్లాడుతూ ‘ఈ ఫలితం మాకు ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఆందోళన కూడా కలిగిస్తోంది. మా పార్టీ ఐసీయూలో చేరిందా? అనే అనుమానం వస్తోంది.

పార్టీకి పట్టున్న నల్లగొండ జిల్లాలో మూడో స్థానానికి దిగజారడం, డిపాజిట్‌ కోల్పోవడం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశమే. అయితే, పార్టీ కేడర్‌ స్థైర్యాన్ని మాత్రం అభినందించాల్సిందే. పార్టీని వీడి వెళ్లిపోయిన రాజగోపాల్‌రెడ్డి గెలవకుండా నిలువరించడం కూడా కాంగ్రెస్‌ పార్టీ పరంగా మంచి పరిణామమే.’అని వ్యాఖ్యానించడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement