పదేళ్లు పగ్గాలివ్వండి | CM Revanth Reddy visit to Aleru Constituency of Yadadri District | Sakshi
Sakshi News home page

పదేళ్లు పగ్గాలివ్వండి

Jun 7 2025 1:03 AM | Updated on Jun 7 2025 1:03 AM

CM Revanth Reddy visit to Aleru Constituency of Yadadri District

తిర్మలాపురం వద్ద అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌, రాజనర్సింహ, మండలి చైర్మన్‌ గుత్తా, ఎంపీ చామల, ప్రభుత్వ విప్‌ ఐలయ్య

తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం 

తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు 

బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చాం

మహిళలను కోటీశ్వరులను చేసేలా ప్రణాళిక

బీఆర్‌ఎస్‌ కాదు.. అది భారత దెయ్యాల పార్టీ 

దెయ్యాలు ఉన్నాయన్న ఇంటిబిడ్డ ప్రశ్నకు ఆ నాయకుడు సమాధానం చెప్పట్లేదు 

ఒక్క నోటీసు ఇస్తేనే ఆగమాగం అయితుండు 

తిర్మలాపురం సభలో సీఎం రేవంత్‌రెడ్డి 

ఆలేరు నియోజకవర్గంలో రూ. 1,051.45 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్‌ పార్టీకి పదేళ్లు పాలించే అధికారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణను అన్నివిధాలా అభివృద్ధి చేసి తీరుతామని ఆయన చెప్పారు. ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పడగొడతానని ఆనాడు తొడగొట్టి చెప్పి పట్టు పట్టినం.. పడగొట్టినం. ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్నా. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో రూ. 1,051.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రధానంగా రూ. 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణం, రూ. 200 కోట్లతో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్, రూ. 183 కోట్లతో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధ్యక్షతన తిర్మలాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

దేశంలో ఎవరూ చేయని విధంగా కులగణన ద్వారా బీసీల లెక్క తేల్చి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కులగణన చేసే అనివార్యతను కల్పించామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి దశాబ్దాల కలను నెరవేర్చామని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు లాంటీ సీనియర్‌ నేత ఎస్సీ వర్గీకరణపై తనను అభినందించారని సీఎం చెప్పారు.

గత ప్రభుత్వం గంధమల్ల, మూసీ కాలువల ఆధునీకరణ, ఎస్‌ఎల్‌బీసీ, డిండి వంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్‌ నిలదీశారు. గంధమల్లకు నీళ్లు ఎలా ఇస్తారని కొందరు అడుగుతున్నారని.. నిధులిచి్చన తమకు గంధమల్లకు నీళ్లు ఎలా ఇవ్వాలో తెలియదా? అని సీఎం బీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నించారు. గోదావరి జలాలను అందించడానికి ఎస్సారెస్పీ, మిడ్‌ మానేరు కట్టింది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కాదా అని ఆయన అడిగారు. 

లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు 
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలను కోటీశ్వరులను చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలకు రూ. 21 వేల కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణను ఆడబిడ్డల చేతిలో పెట్టామన్నారు. ప్రజాపాలనలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాసంక్షేమమే «ధ్యేయంగా పనిచేస్తున్నామని రేవంత్‌ వివరించారు. తిరుమల తరహాలో త్వరలో యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా? 
‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు. గతేడాది నవంబర్‌ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని మాట ఇచ్చా. ఎవరు అడ్డుపడినా మూసీ నదిని పునరుజ్జీవం చేసి తీరుతాం. ప్రధాని మోదీ సబర్మతి, యమునా నదుల ప్రక్షాళన, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చుగానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?’అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు.  

వాసాలమర్రిని బాగుచేస్తా.. 
కేసీఆర్‌ ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు రోడ్డు వేసుకోవడానికి వాసాలమర్రి ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. ‘ఆనాడు వాసాలమర్రికి వచ్చి ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రిపాలు చేసిండు. వాసాలమర్రిలో ఇళ్లు కూలగొట్టి శ్మశానంగా మార్చిండు. ఆయన ఆగం చేసినా వాసాలమర్రి గ్రామ పరిస్థితిని బాగు చేస్తా’అని సీఎం రేవంత్‌ చెప్పారు. ఇందుకోసం గ్రామ పరిస్థితిని అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. 

ఆలేరును అభివృద్ధి చేస్తా..  
బలహీనవర్గాల బిడ్డ బీర్ల ఐలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు ప్రజలకు అండగా ఉంటానని సీఎం రేవంత్‌ అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తామని అందరికీ మాట ఇస్తున్నా అని చెప్పారు. అడగకున్నా ఐలయ్యకు ప్రభుత్వ విప్‌ పదవి ఇచ్చానని సీఎం చెప్పారు. 

దెయ్యాల రాష్ట్ర సమితిగా పిలవండి 
బీఆర్‌ఎస్‌ను ఇకపై దెయ్యాల రాష్ట్ర సమితి (డీఆర్‌ఎస్‌)గా పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ ఇంటి బిడ్డనే బయటపెట్టినా ఆ దెయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ రాష్ట్రం పొలిమేరల వరకు తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు. కోర్టుకు వచ్చి జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండు’అని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి వ్యక్తులే కోర్టుకు హాజరయ్యారని రేవంత్‌ గుర్తుచేశారు. 

ఉద్యోగులకు అండగా ఉంటాం.. 
రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని సీఎం రేవంత్‌ చెప్పారు. గత ప్రభుత్వం విడతలవారీగా వేతనాలు ఇచి్చందని.. కానీ ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచన్‌గా జీతాలు ఇస్తున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు ఇచి్చన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు 

రూ. వెయ్యి కోట్లకు శంకుస్థాపన చరిత్రాత్మకం: మంత్రి ఉత్తమ్‌ 
ఆలేరు నియోజకవర్గానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే 80 శాతం జనానికి సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. గత ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసి దొడ్డు బియ్యం ఇచి్చందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న గంధమల్ల చెరువుకు జీవం పోసేందుకు రూ. 574.56 కోట్లతో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం చేస్తున్నామన్నారు. ఎవరు అడ్డుపడినా గంధమల్ల రిజర్వాయర్‌ను పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. 

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి 
పేదలందరికీ రూ. 5 లక్షల చొప్పున ఖర్చు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రూ. 210 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు ఇచ్చేలా పైపాప్‌లైన్‌ పనులను ప్రారంభించామన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఈ పైప్‌లైన్లను మూడు నెలల్లో పూర్తి చేసి భగీరథ నీళ్లు అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, సోనియా గాంధీ కలలు కన్న తెలంగాణాను, రాహుల్‌ గాంధీ ఆలోచనలను నిజం చేస్తున్న నాయకుడు రేవంత్‌రెడ్డి అని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య కొనియాడారు. 

ఆలేరు నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తీన్మార్‌ మల్లన్న, శంకర్‌నాయక్, శ్రీపాల్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement