పకడ్బందీ వ్యూహాలతో పనిచేయాలి | CM Revanth Reddy in meeting with Congress leaders | Sakshi
Sakshi News home page

పకడ్బందీ వ్యూహాలతో పనిచేయాలి

Feb 21 2025 4:57 AM | Updated on Feb 21 2025 4:57 AM

CM Revanth Reddy in meeting with Congress leaders

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి

50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని పెట్టండి 

ఓటర్లు పోలింగ్‌ బూత్‌కు వెళ్లేలా చూడాలి

కాంగ్రెస్‌ నేతలతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ పకడ్బందీ వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ నేతలు, కేడర్‌ను సిద్ధం చేస్తోంది. కరీంనగర్‌– ఆదిలాబాద్‌– నిజామాబాద్‌–మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలపై వరుసగా రెండోరోజు గురువారం కాంగ్రెస్‌ పార్టీ జూమ్‌ సమావేశం నిర్వహించింది. 

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు కోసం పకడ్బందీగా ప్రచార వ్యూహం రూపొందించుకోవాలని, ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించాలని సూచించారు. యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు గ్రామ స్థాయి నుంచి వ్యూహాలు రచించాలని, ఓటర్లకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ వారిని పోలింగ్‌ బూత్‌కు తీసుకెళ్లి ఓటు వేయించేలా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులకు విస్తృతంగా ప్రచారం చేయాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా పని చేయాలని కోరారు.

ప్రతి ఓటూ కీలకమే..:      మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా సీరియస్‌గా తీసుకోవాలని, ఎలిమినేషన్‌ ప్రక్రియలో ప్రతి ఓటు చాలా కీలకమైందని సీఎం చెప్పారు. ఓటర్‌ మ్యాపింగ్‌ చేయడం, ఓటర్లను ప్రత్యేకంగా కలవడం లాంటి అంశాలు చాలా ముఖ్యమైనవని, ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పారు. 

గాంధీభవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ పెట్టి నిరంతరం పర్యవేక్షించాలని పార్టీ నేతలను ఆదేశించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక చాలా కీలకమైనదని, ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టేలా కృషి చేయాలని కోరారు. 

మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని 42 అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్‌చార్జీలు, యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement