
‘ఈగల్’ లోగోను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి హెచ్చరిక
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇకపై ‘ఈగల్’
తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాల ఆలోచన చేస్తే వెన్ను విరుస్తాం
మత్తు ముఠాలు రాష్ట్రంలోకి రావాలంటే వణికిపోవాలి
స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ మూలాలు గుర్తిస్తే కేసులు
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో సీఎం..
హాజరైన రామ్చరణ్, విజయ్ దేవరకొండ
సాక్షి, హైదరాబాద్: ‘నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే సమీక్ష పెట్టి మరీ హెచ్చరించా..తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని. మళ్లీ అదే చెబుతున్నా.. తెలంగాణ సరిహద్దుల్లోకి మత్తు ముఠాలు రావాలంటే వణికే పరిస్థితి ఉండాలి. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ మూలాలు గుర్తిస్తే యాజమాన్యాలపైనా కేసులు పెడతాం. తెలంగాణలో ఎక్కడ డ్రగ్స్ మూలాలు ఉన్నా కనిపెట్టేలా ‘ఈగల్’ రంగంలోకి దిగుతుంది..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
‘ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్ర యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం న్యాయమా? ఉద్యమాల గడ్డ తెలంగాణ. ఇక్కడ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి బలవుతుంటే చూస్తూ కూర్చుందామా?..’ అంటూ ప్రశ్నించారు. అంతా కలిస్తేనే ఆదర్శవంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా పాల్గొన్న సినీ హీరోలు రామ్చరణ్, విజయ్ దేవరకొండ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడారు.
పంజాబ్, హరియాణా పరిస్థితి రావొద్దు
‘ఒకప్పుడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణను గంజాయి, డ్రగ్స్ గడ్డగా మార్చొద్దు. ఒకప్పుడు దేశ స్వాతంత్య్ర పోరాటంలో, దేశ రక్షణలో ముందున్న పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని యువత ఇప్పుడు డ్రగ్స్ మహ్మమ్మారితో నిరీ్వర్యమైపోతోంది. అలాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా ఉండాలనే సదుద్దేశంతోనే తెలంగాణలో గంజా యి, ఇతర మత్తుపదార్థాల రవాణా, వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక దేశాన్ని దెబ్బ తీసేందుకు శత్రు దేశాలు డ్రగ్స్ను సైతం ఆయుధంగా మార్చుకునే పరిస్థితులు నేడు ఉన్నాయి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో.. ఇకపై ‘ఈగల్’
‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్బీ)ను ఇకపై ‘ఈగల్’ గా మారుస్తున్నాం..ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. తెలంగాణలోని కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడ గంజాయి పండించినా..ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సప్లయ్ చేసినా ఈగల్ గుర్తిస్తుంది. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో డ్రగ్స్ పట్టుబడితే యా జమాన్యాల పైనా కేసులు పెట్టాలని డీజీపీని ఆదేశిస్తున్నా.
కాలేజీలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి
విద్యార్థుల ప్రవర్తనను గమనించాల్సిన బాధ్యత యాజమాన్యాలపైనా ఉంది. కొందరు తల్లిదండ్రులు తమకున్న పరిస్థితుల కారణంగా వారి పిల్లలపై దృష్టి పెట్టలేకపోవచ్చు. కానీ అత్యంత ఎక్కువ సమయం స్కూళ్లు, కాలేజీల్లోనే గడుపుతారు కాబట్టి విద్యార్థుల ప్రవర్తనను గమనించేందుకు యాజమాన్యాలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి. చాక్లెట్లు కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి ఉంది.
కాబట్టి డ్రగ్స్ జాడ గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విద్యార్థులు కూడా ఒకవేళ చదువుల్లో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. నేను ఉద్యోగాలు ఇస్తాను. లేదంటే రాజకీయంగా ఎదగాలి. మన యువత న్యూయార్క్, టోక్యో, సౌత్ కొరియా యువతతో పోటీపడే స్థాయికి ఎదగాలి..’ అని సీఎం ఆకాంక్షించారు.
సినీ హీరోల విజయ గాథలు స్ఫూర్తిగా తీసుకోవాలి
‘ఎవరికీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. కష్టపడితేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయి. మాకెవరికీ బ్యాంక్ గ్రౌండ్ లేదు. చిరంజీవికి ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కఠోర శ్రమతో ఆయన మెగాస్టార్గా ఎదిగారు. రామ్చరణ్ కూడా ఎంతో శ్రమతో ఈ స్థాయికి ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ సాధించారు. నేను కూడా 2006లో జెడ్పీటీసీగా మొదలు పెట్టి 2023 నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యాను.
విజయ్ దేవరకొండ కూడా నాలాగే నల్లమల నుంచి వచ్చారు. మా పక్క ఊరే. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా హీరోగా ఎదిగారు. అయితే సినిమాల్లోని పాత్రలను కాకుండా సినీ హీరోల నిజ జీవితంలోని విజయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి..’ అని రేవంత్రెడ్డి కోరారు.
ఎఫ్డీసీ చైర్మన్, సినీ నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ.. డ్రగ్స్ తీసుకునే వారిని బహిష్కరించాలని మలయాళ సినీ పరిశ్రమలో నిర్ణయం తీసుకున్నారని, తెలుగు చిత్రపరిశ్రమలో కూడా అలాంటి చర్యలు తీసుకోవడంపై చర్చిస్తామన్నారు. తెలంగాణను మత్తు రహితంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీజీపీ జితేందర్ కోరారు. ఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు నషా ముక్త్ (మత్తు రహిత) తెలంగాణ ధ్యేయంగా తమ విభాగం పనిచేస్తోందన్నారు.
కాగా డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లొద్దని..డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దామనే నినాదంతో రూపొందించిన లఘు చిత్రాన్ని, వీడియో గీతాన్ని సీఎం విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దాం’ వీడియో గీతాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి, విజయ్ దేవరకొండ, రాంచరణ్, అడ్లూరి లక్ష్మణ్, గోపీచంద్, జితేందర్
ఒక తండ్రిగా నాకు ఆందోళన కలుగుతోంది..
స్కూళ్ల వద్ద ఐస్క్రీమ్లు, చాక్లెట్లలో ఏమిస్తున్నారో తెలియట్లేదు. పిల్లలను బయటకు పంపించాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక తండ్రిగా ఇప్పుడు నాకు కూడా ఆందోళనగా ఉంది. యువత డ్రగ్స్ వైపు మళ్లకుండా కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయం. డ్రగ్స్ మహమ్మారిని తరిమేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి మేం కూడా పూర్తిగా సహకరిస్తాం. డ్రగ్స్ బారిన పడకుండా కాపాడడం మన కుటుంబం నుంచే మొదలు పెడదాం. ప్రతి ఒక్కరం ఒక సైనికుడిలా పోరాడాలి. అప్పుడే డ్రగ్స్లేని సమాజం సాధ్యం.
– రామ్చరణ్
ఆరోగ్యం లేకపోతే అన్నీ వృథాయే..
సినిమాలు, షూటింగ్లు, ఇల్లు మినహా బయట ఏం జరుగుతుందో నాకు పెద్దగా తెలియదు. కానీ ఈ మధ్య కొందరు పోలీసు అధికారులు ఈ డ్రగ్స్ విస్తరణను నాకు వివరించారు. ఆ తర్వాతే ఇది ఎంత ముఖ్యమైన అంశమో నాకు అర్థమైంది. అందుకే డ్రగ్స్తో వచ్చే ముప్పును చెప్పడానికి వచ్చా. డబ్బులు లేని లైఫ్ను.. ఉన్న లైఫ్ నేను చూశా. సక్సెస్, మనీ ఉన్నా..ఆరోగ్యం బాగా లేకపోతే అది వృథా. కాబట్టి డ్రగ్స్కు దూరంగా ఉండండి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించండి..డబ్బులు సంపాదించండి. తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి. అదే మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
– విజయ్ దేవరకొండ