మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి–సాగర్‌ | CM Revanth, Minister Uttam proposal before CR Patil on Ichampalli | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి–సాగర్‌

Jun 20 2025 12:38 AM | Updated on Jun 20 2025 5:51 AM

CM Revanth, Minister Uttam proposal before CR Patil on Ichampalli

గురువారం ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను సత్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌

కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌ ముందు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌ ప్రతిపాదన

గోదావరి జలాలను వినియోగించాలనుకుంటే దీనిపై చర్చకు సిద్ధమని వెల్లడి

గతంలో ఈ అనుసంధాన ప్రాజెక్టును ప్రతిపాదించిన కేంద్రం

15.8 టీఎంసీల సామర్థ్ధ్యంతో ఇచ్చంపల్లి వద్ద బరాజ్‌ నిర్మాణానికి ప్రణాళిక

రోజుకు 2.2 టీఎంసీల నీటిని సాగర్‌కు మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ డీపీఆర్‌

మొత్తం 230 టీఎంసీల్లో తెలంగాణకు 65, ఏపీకి 80, తమిళనాడుకు 84 టీఎంసీల కేటాయింపు

ఏపీ చేపట్టిన ‘బనకచర్ల’ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టును ముందుకు తెచ్చిన తెలంగాణ

సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. గతంలో కేంద్రం ప్రతిపాదించిన ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్‌ అనుసంధాన ప్రక్రియను మళ్లీ తెరపైకి తెచ్చింది. గోదావరి జలాలను వినియోగించదలిస్తే కేంద్రం సాయమందించే ఇచ్చంపల్లి–సాగర్‌ లింకు ప్రాజెక్టుపై చర్చించేందుకు తాము సిద్ధమని తెలిపింది. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ మేరకు ఒక ప్రతిపాదనను తాజాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ముందుంచారు. దీంతో నాలుగేళ్ల కిందట గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తయారు చేసిన ఇచ్చంపల్లి–సాగర్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మొత్తం 247 టీఎంసీల మళ్లింపు ఎన్‌డబ్ల్యూడీఏ 2020–21లో రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు  అందజేసిన డీపీఆర్‌లో..ఇచ్చంపల్లి–సాగర్‌ అనుసంధాన ప్రాజెక్టు, జలాల లభ్యత, మళ్లించే విధానం, అవసరమయ్యే నిధులు, ఆయా రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలు, వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు తదితర అంశాలను స్పష్టంగా పేర్కొంది. దీని ప్రకారం.. తెలంగాణలోని ఇచ్చంపల్లి వద్ద గోదావరి నదిపై 15.8 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్‌ నిర్మించి తమిళనాడులో కావేరి నదిపై ఉన్న గ్రాండ్‌ ఆనకట్ట వరకు 247 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. 

బరాజ్‌ నుంచి రోజుకు 2.2 టీఎంసీల చొప్పున నీటిని సాగర్‌కు మళ్లిస్తారు. ఈ దారిలో గొట్టిముక్కల బ్రాంచి కాలువ కింద నల్లగొండ జిల్లాలోని మునుగోడు, చండూరు ప్రాంతాల్లో  80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు, ఎస్సారెస్పీ–2 కింద 1.78 లక్షలు, ఎస్‌ఎల్‌బీసీ కింద 1.09 లక్షల హెక్టార్లకు నీరందించాల్సి ఉంటుంది. 

ఇక ఏపీలో సాగర్‌ కుడి కాలువ కింద 1.26 లక్షల హెక్టార్లు, నాగార్జునసాగర్‌–సోమశిల కింద 1.68 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీటిని ప్రతిపాదించారు. సోమశిల–కావేరి మధ్య 2.5 లక్షల హెక్టార్లకు నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి. 

మూడు రాష్ట్రాలకు 230 టీఎంసీలు
గోదావరిలో వరద ఉండే జూన్‌–అక్టోబర్‌ నెలల్లో 143 రోజుల్లో 247 టీఎంసీలను మళ్లిస్తారు. ఇందులో ఆవిరి నష్టాలు పోనూ మిగిలే 230 టీఎంసీలలో తెలంగాణ 65, ఆంధ్రప్రదేశ్‌ 79.9, తమిళనాడు 84 టీఎంసీలు వినియోగించుకునేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు ఆ సమయంలోనే రూ.85 వేల కోట్ల మేర వ్యయాన్ని అంచనా వేసింది. 

ఇచ్చంపల్లి నుంచి సాగర్‌కు నీటిని మళ్లించే క్రమంలో మూడు లిఫ్టులు నిర్మించాల్సి ఉండగా, వీటి నిర్వహణకు 3,840 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు అవసరమవుతుందని, ఇందుకు ఏటా రూ.770 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టింది. ఇక ఇచ్చంపల్లి వద్ద నిర్మించే బరాజ్‌తో 9,300 హెక్టార్లు ముంపునకు గురికానుండగా, 22 వేల మంది నిరాశ్రయులవుతారని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. 

అయితే ఈ ప్రతిపాదనను అప్పట్లో తెలంగాణ వ్యతిరేకించింది. దీనికి దిగువన అకినేపల్లి నుంచి ఒక ప్రతిపాదన, తుపాకులగూడెం నుంచి మరో ప్రతిపాదన, దుమ్ముగూడెం నుంచి ఇంకో ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే ఇంద్రావతి మిగులు జలాలపై ఛత్తీస్‌గఢ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో దీనిపై చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో ఏపీ పోలవరం–బనకచర్ల చేపట్టడంతో, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ తాజాగా ఇచ్చంపల్లి–సాగర్‌ అనుసంధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement