'ఆ రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.3 లక్షలు' | CM KCR Cabinet Meeting At Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

'ఆ రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.3 లక్షలు'

Nov 20 2021 5:15 PM | Updated on Nov 20 2021 8:14 PM

CM KCR Cabinet Meeting At Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సంవత్సరం టార్గెట్‌ ఇవ్వమంటే స్పందించడం లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు అన్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఢిల్లీకి వెళ్తున్నాం. కేంద్ర మంత్రులు, అధికారులను కలుస్తాం. అవకాశముంటే ప్రధానమంత్రిని కలుస్తాం.  యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని వార్త వచ్చింది. అది గాలివార్తా లేక నిజమా అనేది తెలుసుకుంటాం.

రైతులకు ప్రధాని సారీ చెప్తే సరిపోదు. రైతులపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలి. సాగుచట్టంపై పోరాటంలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన రైతు కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం. రైతు ఆందోళనలో చనిపోయిన ప్రతిరైతు కుటుంబానికి తెలంగాణప్రభుత్వం తరపున రూ.3 లక్షలు అందిస్తాం. కేంద్రం కూడా ప్రతిరైతు కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి. కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలి. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశంపై పోరాటం చేస్తాం అని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషం. 

ఆ చట్టాలను కూడా కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి
విద్యుత్ చట్టం తెచ్చి రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నారు. మా రాష్ట్రంలో మీటర్లు పెట్టే ఉద్దేశం లేదు. మాపై ఒత్తిడి తెస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మీటర్లు పెట్టుకుంటె ఇబ్బంది లేదు. విద్యుత్ చట్టాలన్ని వెంటనే కేంద్రం వెనక్కి తీసుకోవాలి. నదులలో నీటి వాటా కేటాయింపులపై రేపు మళ్ళీ జలశక్తి మంత్రిని కలుస్తా. టైం పిరియడ్ పెట్టి వాటా తేల్చాలని కోరుతాం. టైం పిరియడ్ పెట్టకుంటే.. పెద్ద ఎత్తున ఉధ్యమాలు చేస్తాం ఇతర రాష్ట్రాల మద్దతు కూడా తీసుకుంటాం. 

రిజర్వేషన్లపై కేంద్ర తేల్చాలి
గిరిజనుల రిజర్వేషన్లను కూడా కేంద్రం తేల్చాలి. లేదంటే పెద్ద ఎత్తున గిరిజన ఉధ్యమాలు మొదలవుతాయి. ఎస్సీ రిజర్వేషన్లు కూడా వీలైనంత త్వరగా తేల్చాలి. బీసీ కులగణనను వెంటనే చేపట్టాలి. ఎందుకు బీసీ కుల గణన చేయట్లేదు. ఎస్సీ, ఎస్టీలాగే బీసీ కులగణన చేయాల్సిందే. ప్రభుత్వమే కులం సర్టిఫికెట్ ఇచ్చినపుడు.. బీసీ కులగణన చేయడానికి ఏం ఇబ్బంది. రాష్ట్ర బీజేపీ నేతల బండారు బయటపడ్డది. ప్రజల ముందు స్థానిక బీజేపీ నేతలు తప్పు ఓప్పుకొని క్షమాపణ కోరాలి. వర్షాకాల చివరి గింజ వరకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను  వెనక్కి తీసుకోవడాన్ని  ఎన్నికల స్టంట్ అంటున్నారు. బీజేపీని దేశంలో ఎవరు నమ్మడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement