సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం చేసిన ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరధ్ను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం జరిగాయి. ఈ వార్తలు న్యాయమూర్తులపై ప్రభావం చూపే ప్రయత్నంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిత వార్తలు ప్రచారం కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజల మధ్య విస్తృత చర్చకు దారి తీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.
చార్మినార్ పోలీసులు ఐటీ యాక్ట్తో పాటు భారత న్యాయసంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 353(1)(c), బీఎన్ఎస్ 353(2), బీఎన్ఎస్ 267 సెక్షన్ల కింద ఎస్ఐఆర్ (SIR) నమోదు చేసి, కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు.


