గ్రూప్‌–1.. కటాఫ్‌ ఉండదు: టీఎస్‌పీఎస్సీ | Candidates still confused about Group-1 Preliminary Exam Question Paper | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1.. కటాఫ్‌ ఉండదు: టీఎస్‌పీఎస్సీ.. ‘కీ’ వస్తేనే స్కోర్‌ తెలిసేది

Oct 18 2022 1:27 AM | Updated on Oct 18 2022 7:41 AM

Candidates still confused about Group-1 Preliminary Exam Question Paper - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై అభ్యర్థుల్లో ఇంకా గందరగోళం వీడలేదు. రాసిన ప్రశ్నలకు సరైన జవాబులపై అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక కీ విడుదలైతే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 503 కొలువుల కోసం ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 2,86,051 మంది దీనికి హాజరయ్యారు. అభ్యర్థులుగానీ, కోచింగ్‌ సెంటర్లుగానీ పరీక్ష ముగిసిన తర్వాత నిపుణులు, మేధావులను సంప్రదించి సరైన సమాధానాలపై, తమకు వచ్చే మార్కులపై అంచనాకు రావడం జరుగుతుంది. కానీ ఆదివారం నాటి గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై ఇప్పటికీ అభ్యర్థుల్లో గందరగోళమే కనిపిస్తోంది.

ఒకే ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉండటమే దీనికి కారణమని.. కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు, మూడు సరైన సమాధానాలు ఉన్నాయని అభ్యర్థులు చెబుతు న్నారు. ఇక ఒకే ప్రశ్నలో నాలుగు ప్రశ్నలు అడు గుతూ వాటిని జతపర్చాలని సూచించారని అంటున్నారు. విభిన్న రకాలుగా ప్రశ్నలు ఇవ్వడంతో సరైన సమాధానాలను గుర్తించడంలో ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. పరీక్ష జరిగి రెండు రోజులు అవుతున్నా కనీసం కోచింగ్‌ సెంటర్లు కూడా నమూనా ‘కీ’ని విడుదల చేయకపోవడం గమనార్హం.

కటాఫ్‌ మార్కులేమీ ఉండవు! 
గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రత్యేకంగా కటాఫ్‌ మార్కులంటూ ఏమీ ఉండవని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లోనే ఈ అంశాన్ని ప్రత్యేకంగా తెలిపిన కమిషన్‌.. సోమవారం మరోమారు ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో ఎక్కువ మార్కులు వచ్చినవారిని.. మల్టీజోన్ల వారీగా 1ః50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తారు. మొత్తం 503 పోస్టులు ఉన్న నేపథ్యంలో.. ఎక్కువ మార్కులు వచ్చిన సుమారు 25,150 మందికి మెయిన్స్‌ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు.  

ప్రశ్నపత్రం కోడింగ్‌లో కొత్త విధానంతో..
గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం కోడింగ్‌లో టీఎస్‌పీఎస్సీ కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. ఇదివరకు కమిషన్‌ నిర్వహించిన పరీక్షల ప్రశ్న పత్రాన్ని ఏ, బీ, సీ, డీ నాలుగు కోడ్‌లలో తయారు చేసింది. ఈసారి కాపీయింగ్‌కు ఆస్కా రం లేకుండా ఆరు డిజిట్ల కోడ్‌తో ప్రశ్నపత్రాన్ని తీసుకొచ్చింది. విభిన్న రూపాల్లో ప్రశ్నపత్రం తయారైంది. దీనితో ఏ కోడ్‌కు చెందిన ప్రశ్న పత్రానికి నమూనా కీని తయారు చేయాలనే దానిపై కోచింగ్‌ సెంటర్లు, నిపుణులు సైతం తికమక పడ్డారు.

చివరికి ప్రశ్నపత్రం కోడ్‌కు బదులుగా.. పరీక్షలో వచ్చిన ప్రశ్నలు కొన్నింటికి జవాబులను నిర్ధారిస్తూ సామాజిక మాధ్యమాల్లో అంచనాలను పోస్టు చేశారు. పూర్తి స్థాయిలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. దీనితో టీఎస్‌పీఎస్సీ కీ వచ్చేదాకా అంచనాకు వచ్చే పరి స్థితి లేదని అభ్యర్థులు అంటున్నారు. కమిషన్‌ కీ విడుదల చేసేందుకు పదిరోజుల సమయం పడు తుందని అంచనా వేస్తున్నారు. ముందుగా అభ్య ర్థుల ఓఎంఆర్‌ జవాబు పత్రాలను కమిషన్‌ వెబ్‌ సైట్‌లో అందుబాటులోకి తెచ్చిన తర్వాతే ‘కీ’ని విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement