సాక్షి, నల్గొండ: జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో విరుచుకపడ్డారు. అనంతరం మంత్రి ఆఫీసును తగలబెట్టే యత్నం చేశారు. తమ పార్టీ ఆఫీసుపైకి వస్తే ప్రతిఘటన తప్పదని బీజేపీ శ్రేణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు సైతం దాడికి తెగబడ్డారు. నల్లగొండ బీజేపీ ఆఫీసుపై దాడికి తెగబడ్డారు. జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అసలు ఏమైంది
ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం వద్ద కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ‘కాంగ్రెస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు ఈ క్రమంలో అమిత్ షా దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. అనంతరం బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్లిన యూత్ కాంగ్రెస్ నేతలు.. బీజేపీ ఆఫీస్ గేట్లకు నల్లరంగు పూయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
అనంతరం దీనికి ప్రతికారంగా గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. గాంధీ భవన్ వైపు వచ్చిన పలువురు బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇరువర్గాల ఆందోళనల నేపథ్యంలో గాంధీ భవన్పై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గాంధీ భవన్ చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి ఆఫీసుపై మరోసారి బీజేపీ శ్రేణులు దాడి చేశారు.


