అవినీతికి బినామీ ముసుగు | Benami mask for corruption in Telangana | Sakshi
Sakshi News home page

అవినీతికి బినామీ ముసుగు

Jul 7 2026 5:44 AM | Updated on Jul 7 2026 5:44 AM

Benami mask for corruption in Telangana

ఏసీబీకి చిక్కినా అక్రమార్జనకు ఢోకా లేకుండా అక్రమార్కుల ఎత్తులు 

బంధువులతోపాటు సన్నిహితులపై రూ. కోట్ల ఆస్తులు పెడుతున్న వైనం 

బినామీ ఆస్తులను నిర్ధారించడంలో ఏసీబీకి ఎదురవుతున్న సవాళ్లు 

ఈ ఏడాది 13 కేసుల్లో 24 మంది బినామీల గుర్తింపు.. నోటీసులు జారీ

సాక్షి, హైదరాబాద్‌: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో రూ. కోట్లలో అక్రమ ఆస్తులు బయటపడుతున్నా వాటి అసలు యాజమాన్యాన్ని నిరూపించడం అధికారులకు అంత సులువు కాని పరిస్థితి నెలకొంది. అవినీతి అధికారుల వెనుక ఇప్పుడు ఒక బలమైన బినామీ నెట్‌వర్క్‌ పనిచేస్తోంది. గతంలో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలపై ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులు.. ఇటీవల పంథా మార్చారు. ఏసీబీకి చిక్కినా, అక్రమ సంపాదన కోల్పోకుండా ఉండేందుకు బంధువులు, అత్యంత సన్నిహిత మిత్రులు, కొన్నిసార్లు డ్రైవర్లు, గన్‌మెన్లు, ఇంటి పనివారి పేర్లతోనూ ఆస్తులను కొంటున్నట్లు విచారణల్లో బయటపడుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపించింది. ఏసీబీ నమోదు చేసిన 13 కేసుల్లో ఇప్పటికే 24 మంది బినామీలను గుర్తించింది. వారికి బినామీ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేస్తూ ఆస్తుల మూలాలు, పెట్టుబడుల వివరాలు సేకరిస్తోంది. 

బయటపడుతున్నది కొంతే.. దాగి ఉన్నది మరెంతో...  
ఏసీబీ అధికారులు నిర్వహించే సోదాల్లో నగదు, బంగారం, విలువైన భూములు, విల్లాలు, ఫ్లాట్లు, వాణిజ్య భవనాలు, వ్యవసాయ భూములు, కంపెనీల్లో పెట్టుబడులు, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు బయటపడుతున్నాయి. కానీ రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో యజమానిగా ఉన్న వ్యక్తి, వాస్తవంగా డబ్బు పెట్టిన వ్యక్తి వేర్వేరుగా ఉండటంతో కేసు నిరూపణ క్లిష్టంగా మారుతోంది. ఆస్తి కొనుగోలు చేసిన సమయంలో డబ్బు ఎవరు చెల్లించారు? బ్యాంకు లావాదేవీలు ఎవరి ఖాతాల నుంచి జరిగాయి? ఆస్తి నిర్వహణ ఎవరు చేస్తున్నారు? ఆదాయం లేని వ్యక్తి రూ. కోట్ల ఆస్తిని ఎలా కొనుగోలు చేశాడు? వంటి అంశాలపై ఏసీబీ లోతుగా విచారణ చేపడుతోంది. 

ఇటీవలి కేసుల్లోనూ అదే తీరు.. 
ఇటీవల వెలుగులోకి వచ్చిన పలువురు ఉన్నతాధికారుల కేసుల్లో బినామీ వ్యవహారం ప్రధానంగా బయటపడింది. డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ల్యాండ్‌ అండ్‌ సర్వే రికార్డ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నరహరి కేసులోనూ బంధువులు, ఇతరుల పేర్లతో భారీ పెట్టుబడులు పెట్టిన అంశాలు విచారణలో బయటకు వచ్చాయి. ఆర్‌ అండ్‌ బీ ఈఎన్సీ మోహన్‌ నాయక్‌ కేసులోనూ బినామీల పేర్లతో ఆస్తుల కొనుగోళ్లపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ కేసుల్లో బినామీల ఆర్థిక స్థితి, ఆదాయ వనరులు, బ్యాంకు లావాదేవీలు, ఆదాయపు పన్ను రిటర్నులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. 

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు... పాత కేసులే నిదర్శనం.. 
అవినీతి అధికారులు సంపాదించిన సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులుగా మార్చి బినామీల పేర్లతో భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు ఏసీబీ గత కేసుల్లో ఆధారాలు సేకరించింది. అయితే ఈ ఆస్తులు వాస్తవానికి నిందితుల అక్రమ సంపాదనేనని కోర్టులో నిరూపించడం ప్రాసిక్యూషన్‌కు పెద్ద సవాల్‌గా మారింది. పత్రాల ప్రకారం యాజమాన్యం బినామీల పేర్లలో ఉండటం, నగదు లావాదేవీలకు పూర్తి ఆధారాలు లేకపోవడం వల్ల విచారణ క్లిష్టమైంది. అయినప్పటికీ ఇలాంటి కేసుల్లో బినామీ ఆస్తుల్లో కొన్నింటిని ఏసీబీ అటాచ్‌మెంట్‌ చేసింది. అంతేకాకుండా బినామీదారులపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్‌ కొనసాగిస్తోంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement