భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్‌ | Bail for Bhujangarao and Radhakishan Rao in phone tapping case | Sakshi
Sakshi News home page

భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్‌

Jan 31 2025 1:27 AM | Updated on Jan 31 2025 1:27 AM

Bail for Bhujangarao and Radhakishan Rao in phone tapping case

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో హైకోర్టు ఉత్తర్వులు 

పలు షరతులు విధించిన న్యాయస్థానం 

మరో నిందితుడు శ్రవణ్‌కుమార్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులు మాజీ అడిషనల్‌ ఎస్పీ నాయిని భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో తాజాగా సుప్రీంకోర్టు మరో నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ను, నిందితులు సుదీర్ఘ కాలం జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిస్తున్నట్లు పేర్కొంది. అయితే, కోర్టు నిందితులకు పలు షరతులు విధించింది. రూ.లక్ష చొప్పున సొంత పూచీకత్తు, 2 ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. 

8 వారాలపాటు ప్రతీ సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్‌హెచ్‌ఓ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా అవసరమై విచారణాధికారి కోరితే హాజరుకావాలని తెలిపింది. నిందితులు తమ పాస్‌పోర్టులను వెంటనే ట్రయల్‌కోర్టుకు సమర్పించాలని చెప్పింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, సాకు‡్ష్యలను బెదిరించడం, కలవడం, దర్యాప్తును ప్రభావితం చేయడం లాంటివి చేయవద్దని, మీడియాతో కేసు గురించి మాట్లాడవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. 

బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకునే స్వేచ్ఛను పోలీసులకు ఇచ్చింది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి 2024, మార్చిలో భుజంగరావు, రాధాకిషన్‌రావులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్తం భుజంగరావుకు నాంపల్లి కోర్టు గత ఆగస్టులో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అప్పటి నుంచి న్యాయస్థానాలు మధ్యంతర బెయిల్‌ పొడిగిస్తూ ఉండటంతో ఆయన బయటే ఉన్నారు.

ఈ నేపథ్యంలో రెగ్యులర్‌ బెయిల్‌ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు, చంచల్‌గూడ జైలులో ఉన్న రాధాకిషన్‌రావు కూడా బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇద్దరి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.సుజన గురువారం తీర్పు వెలువరించారు.  

సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిగణనలోకి.. 
ఇదే కేసులో మరో నిందితుడు తిరుపతన్నకు సుప్రీంకోర్టు తాజాగా బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల కాపీని పిటిషనర్ల న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. 

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను, నిందితులు సుదీర్ఘకాలం జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని షరతులతో బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.  మరో నిందితుడు ఎ.శ్రవణ్‌కుమార్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement